ఫీజు కట్టలేదని అవమానించిన స్కూల్.. స్టూడెంట్ సూసైడ్

హైదరాబాద్ ముషీరాబాద్ పీస్ పరిధిలో కార్పొరేట్ స్కూల్ కాఠిన్యానికి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తరచూ ఫీజులు అడిగి ఇబ్బంది పెడుతుండటంతో అవమానంగా ఫీల్ అయిన మహేష్ అనే విద్యార్థి ప్రాణత్యాగానికి ఒడిగట్టాడు. మహేష్ ముషీరాబాద్ లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్నాడు. రెండు రోజుల క్రితం స్కూల్ ఫీజు కట్టలేదు అనే కారణంతో స్కూల్ యాజమాన్యం బాలుడిని పాఠశాల నుండి పంపించేసింది. రెండు రోజుల నుండి ఇంట్లోనే ఉంటున్న మహేష్ ఇంట్లో ఎవరు లేకపోవటం చూసి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ విషయాన్ని తెలుసుకున్న విద్యార్థి సంఘాలు ఆ స్కూలు వద్ద ఆందోళన చేస్తున్నాయి. విద్యార్థి సంఘాల నేతలు ఫర్నిచర్ అంతా ధ్వంసం చేస్తున్నారు. కాగా బాలుడి తల్లిదండ్రులు ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లో స్కూల్ యాజమాన్యంపై కంప్లైంట్ దాఖలు చేశారు. మహేష్ తల్లిదండ్రులు మాత్రం ఫీజు కట్టినప్పటికీ వారు ప్రతిసారీ ఇలానే టార్చర్ చేస్తున్నారని, అది భరించలేకనే మా బాబు ఆత్మహత చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. స్కూలు యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.