గుంటూరు జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా

గుంటూరు జిల్లాలో ప్రమాదవశాత్తు స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది విద్యార్దులకు గాయాలయ్యాయి. వారికి గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్సనందిస్తున్నారు.

మాచర్లలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కు చెందిన బస్సు వెల్దూర్తి మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన 48 మంది విద్యార్దులతో వెళ్తుంది. మండాది వాగు వద్దకు బస్సు రాగానే ఎదురుగా మరో వాహనం వచ్చింది. దీంతో డ్రైవర్ దానిని తప్పించబోయి పక్కకు తిప్పాడు. బస్సు అదుపు తప్పి వాగులోకి దూసుకు పోయి పల్టీ పడింది. బస్సులో ఉన్న 20 మంది విద్యార్దులకు గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. 

వీరిని వెంటనే మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్సనందించారు. ఆ తర్వాత్ గుంటురు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చిన్నారులకు వైద్యులు కాకుండా స్వీపర్లు కట్లు కట్టారు. దీంతో చిన్నారుల బంధువులు ఆందోళన నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి కృష్ణారెడ్డి విద్యార్దులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.