గుండెపోటు తో సాక్షి టివి జర్నలిస్టు మృతి

తెలుగు రాష్ట్రాల్లో మరో జర్నలిస్టు గుండెపోటుతో నేలరాలాడు. సాక్షి టివిలో పనిచేస్తున్న జర్నలిస్టు మరణించడం జర్నలిస్టు వర్గాల్లో ఆవేదనను మిగల్చింది. పూర్తి వివరాలు ఇవీ.

మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో సాక్షి రిపోర్టర్ గా పనిచేస్తున్న కోరకొప్పుల శ్రీనివాస్ (37) శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. శ్రీనివాస్ మరణవార్త తెలుసుకున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సాక్షి టివి ప్రతినిథి అనీల్ కుమార్, చెన్నూర్, కోటపల్లి, మంచిర్యాల, జైపూర్,  భీమారం మండలాలకు చెందిన వివిధ పత్రికలు, టివి రిపోర్టర్లు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. పలు రాజకీయ పార్టీల నాయకులు కూడా శ్రీనివాస్ కుటుంబసభ్యులను ఓదార్చారు. 

శ్రీనివాస్ కు భార్య సుమలత, రెండేళ్ల కుమారుడు బన్నీ ఉన్నాడు. శ్రీనివాస్ మరణంతో ఆ కుటుంబం దిక్కులేనిదైందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.