నార్కట్ పల్లిలో రోడ్డు ప్రమాదం.. కామినేని మెడికల్ కాలేజి అమ్మాయి స్పాట్ డెడ్ (వీడియో)

నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం ఏపీ లింగోటం వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నార్కట్ పల్లి కామినేని మెడికల్ కాలేజికి చెందిన ముగ్గురు మెడికో అమ్మాయిలు స్కూటి పై వెళ్తుండగా వేగంగా వచ్చిన లారీ వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్రవంతి అనే అమ్మాయి చనిపోగా మరో ఇద్దరు అమ్మాయిలు రమ్య, నాగజ్యోతికి తీవ్రగాయాలయ్యాయి.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్రవంతి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. సమాచారం తెలుసుకున్న మెడికల్ స్టూడెంట్స్ పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. స్రవంతి మృతితో  వారంతా కన్నీరు మున్నీరయ్యారు. ఆదివారం సెలవు దినం కావడంతో సరదాగా వారు ఏపీ లింగోటం వద్ద ఉన్న హోటల్ లో టిఫిన్ కు వారు బయటికి వెళ్లారు. తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  

హైవేపై వారు సరిగానే వస్తున్నా వెనుక నుంచి వచ్చిన లారీ స్పీడ్ గా ఢీకొనడంతో వీరంతా రోడ్డు పై పడిపోయారు. రోడ్డు పై పడడంతో వీరందరి తలలకు బలమైన గాయాలయ్యాయి. స్రవంతి డివైడర్ కు గుద్దు కోవడంతో స్పాట్ లోనే చనిపోయింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరు కామినేని మెడికల్ కాలేజిలో చదువుతున్నారు. డాక్టరు కావాల్సిన స్రవంతి అర్ధాంతరంగా తనువు చాలించడంతో అక్కడ విషాద చాయలు అలుముకున్నాయి. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్రవంతి స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ. రమ్య, నాగజ్యోతిలను చికిత్స నిమిత్తం హైదరాబాద్ కామినేని ఆస్పత్రికి తరలించారు. 

వీడియో కింద ఉంది చూడండి.