నా బిడ్డను ఒక్కసారి చూపించండి.. ఎర్రగడ్డ మనోహరాచారి ఆవేదన

మిర్యాలగూడలో మారుతీరావు ఉదంతం మరువక ముందే ఎర్రగడ్డలో మనోహరాచారి తన కూతురు ప్రేమ వివాహం చేసుకుందని కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. పోలీసు కస్టడీలో ఉన్న మనోహరాచారి తాను పెద్ద తప్పు చేశానని తన కూతురిని ఒక సారి చూపించాలని పోలీసులను వేడుకుంటున్నట్టు సమాచారం.

బంధువుల సూటిపోటి మాటలు భరించలేకే కుమార్తె అల్లుడిపై దాడి చేసినట్టు మనోహర చారి పేర్కొన్నాడు. కుమార్తె ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత తనను పోలీసులు పిలిచి రెండు సార్లు కౌన్సిలింగ్ ఇచ్చారు. దాంతో తాను మామూలుగానే ఉండి రెండు సార్లు తన బిడ్డకు పైసలు కూడా ఇచ్చానన్నాడు. బంధువులు మాత్రం బిడ్డ పెళ్లి చేసుకుంటే ఏం అనవా… ఏం చేయలేవా చేతగానివాడా అని మాటలతో తనను రెచ్చగొట్టారని తెలిపారు.

బాధపడుతూ కూర్చున్న మనోహరాచారి

బంధువుల మాటలతో వారం రోజులుగా డ్యూటికి అని చెప్పి మద్యం తాగానన్నాడు. మద్యం మత్తులోనే కొబ్బరిబోండాల షాపులో కత్తి దొంగిలించి దాడికి పాల్పడ్డానని తెలిపాడు. బంధువుల మాటలకు తోడు బిడ్డ బతిమాలినప్పటికి ఇంటికి రాకపోవడంతో కోపంతోనే ఘాతుకానికి పాల్పడ్డానన్నాడు.

ప్రేమ పెళ్లి చేసుకున్న కుమార్తె మాధవి, అల్లుడు సందీప్ లపై సెప్టెంబర్ 19న సాయంత్రం ఎర్రగడ్డలో మనోహరాచారి కత్తితో దాడి చేశాడు.బట్టలు పెడతానని నమ్మించి పిలిచి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అల్లుడు స్వల్ప గాయాలతో తప్పించుకోగా కుమార్తె మాధవి తీవ్రగాయాల పాలైంది. దాడికి పాల్పడ్డ మనోహరాచారి పోలీసుల అదుపులో ఉన్నాడు.

అల్లారు ముద్దుగా పెంచుకున్న తన బిడ్డను తన చేతులతోనే నరికానని నా బిడ్డను ఒక్కసారి చూపించాలని మనోహరాచారి పోలీసులను వేడుకున్నాడు. చేసిన తప్పుకు బాధపడుతున్నానని మనోహరాచారి కుంగిపోతున్నట్టు పోలీసులు తెలిపారు.