మైనర్లను చితకబాదిన ఐదుగురు పోలీసులపై వేటు

హైదరాబాద్ లోని బోయిన్ పల్లి పోలీసులు మైనర్ పోరగాళ్లను రెండురోజులపాటు లాకప్ లో వేసి చితకబాదిన సంఘటనలో ఐదుగురు పోలీసుల మీద బదిలీ వేటు పడింది. స్థానిక వ్యక్తి దగడ్ సాయి బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నందుకు 9 మంది మైనర్ వ్యక్తులను అదుపులోకి తీసుకుని ఒల్లంతా కుళ్లబొడిచారు పోలీసులు. రెండు రోజులపాటు లాకప్ లో ఉంచుకుని మరీ థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. 

ఈ ఘటనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ సీరియస్ అయ్యారు. విచారణకు ఆదేశించడంతోపాటు ఈ ఘటనకు కారకులైన అధికారులపై బదిలీ వేటు వేశారు. బదిలీ అయిన వారిలో

1 బోయిన్ పల్లి సిఐ ఆనంద్ కిషోర్

2 ఎస్సై గురుస్వామి

3 ఎస్సై శ్రీనివాస్

4 ఎస్సై మోహన్ బాబు

5 హెడ్ కానిస్టేబుల్ తిరుపతి

వీరందరినీ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ సిపి అంజనీ కుమార్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 

ఈ కేసు తాలూకు పూర్వాపరాలు కింద ఉన్నాయి

హైదరాబాద్ లోని బోయిన్ పల్లి పోలీసులు రెచ్చిపోయారు. బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న యువకులను స్టేషన్ కు పట్టుకొచ్చి చికతబాదారు. తోడ్కలు ఊడిపోయేలా ఆ యువకులను కొట్టారు. నడవలేని స్థితిలో ఉన్న ఆ యువకుల పరిస్థితి దయనీయంగా మారింది. బాధితుల కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్ కు వచ్చి ధర్నా చేపట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్ లోని బోయిన్ పల్లి సెవన్ టెంపుల్స్ వద్ద సాయి ముదిరాజ్ అలియాస్ దగడ్ సాయి బర్త్ డే వేడుకలు మంగళవారం సాయంత్రం జరిగాయి. అయితే ఈ వేడుకల్లో హైదరాబాద్ లోని చాలా బస్తీల్లోంచి యూత్ పాల్గొన్నారు. దగడ్ సాయి బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న సమయంలో పోలీసులకు ఒక పలుకుబడి కలిగిన వ్యక్తి (అధికార టిఆర్ఎస్ పార్టీ నేత) ఫోన్ చేసి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

వచ్చే వారమంతా బ్యాంకులు పనిచేయవ్ …ఎందుకో తెలుసా… చదవండి

దీంతో బర్త్ డే పేరుతో న్యూసెన్స్ చేస్తారా అని 9 మంది యువకులను బోయిన్ పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజులపాటు లాకప్ లోనే ఉంచుకుని కసితీరా కొట్టారు. వారి శరీర భాగాలన్నీ కమిలిపోయేలా వాతలు వచ్చేలా కొట్టారు. బాధితులంతా విద్యార్థులు. మైనర్ లు గా తెలుస్తోంది.

అయితే బర్త్ డే జరుపుకున్న దగడ్ సాయి అలియాస్ సాయి ముదిరాజ్ పరారీలో ఉన్నట్లు తెలిసింది. గతంలో సిరిసిల్లలో పోలీసులు కొందరు దళితులపై ఇదే తరహాలో థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఆ కేసులో బాధితులు ఇంకా నడవలేని స్థితిలో ఉన్నారు. కేసు కోర్టులో నడుస్తున్నది. ఆ ఘటన మరవకముందే ఇప్పుడు హైదరాబాద్ లో యూత్ ను చితకబాదారు ఫ్రెండ్లీ పోలీసులు.

అయితే బర్త్ డే పార్టీ రోజు వారిని విచారించి వదిలేశామని పోలీసులు చెబుతున్నారు. కానీ జరిగిన ఘటన మీడియాలో, సోషల్ మీడియాలో హల్ చల్ అయింది. దీంతో హైదరాబాద్ సిటీ సిపి అంజనీ కుమార్ స్పందించారు.  నార్త్ జోన్ డిసిపి సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బోయిన్ పల్లి ఇన్సెక్టర్ ఆనంద్ కిషోర్, ఎస్సైలు గురు స్వామి, శ్రీనివాస్ తమను చితకబాదినట్లు బాధిత విద్యార్థులు చెబుతున్నారు. బర్త్ డే జరిగిన రోజున పరిసరాల్లో ఉన్న సిసి కెమెరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. వీరు ఏమైనా న్యూసెన్స్ చేశారా నఅ్న కోణంలో విచారణ జరుగుుతన్నది.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బాధిత యువకులను పోలీసులు ఎలా కొట్టారో ఫొటోలు, వీడియోలు చూస్తే తెలుస్తుంది.