తన భర్త తనకు కావాలంటూ పోలీసులను ఆశ్రయించిన హిజ్రా

ప్రేమించి పెళ్లి చేసుకోని మోజు తీరాక అదనపు కట్నం కావాలంటూ వేధిస్తూ ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడంటూ దీపిక అనే హిజ్రా విశాఖ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ప్రేమిస్తున్నానంటూ వెంటపడి, అగ్నిసాక్షిగా తాళి కట్టాడు. మోజు తీరాక అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. ప్రశ్నిస్తే చావగొట్టి ముఖం చాటేశాడని ఆమె వాపోయింది. వాలం దీపిక తూర్పు గోదావరి జిల్లా కాకినాడ స్వస్థలం. విశాఖలోని పెదవాల్తేరులో స్థిర పడింది. 2009లో ఆపరేషన్ చేయించుకొని మహిళగా మారింది. నాలుగేళ్ల కిందట శివాజీ పాలేనికి చెందిన చందక సురేష్ ప్రేమిస్తున్నానంటూ పెళ్లి ప్రతిపాదన తేవడంతో దీపిక పెళ్లికి అంగీకరించింది.

దీపిక సురేష్ పెళ్లినాటి ఫోటో

అయితే తాను హిజ్రాను కాబట్టి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రానివ్వనని అగ్రిమెంట్ రాసివ్వాలని కోరింది. సురేష్ రాసిచ్చాడు. గతేడాది అక్టోబర్ 6న ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు కాపురం సజావుగానే సాగింది. కొన్నాళ్ల క్రితం వారి కాపురంలో విబేధాలు తలెత్తాయి. దీపికను సురేష్, అతని మేనమామ భార్య కలిసి తమకు మరో 6 లక్షల రూపాయలు కట్నంగా కావాలంటూ వేధించడం మొదలుపెట్టారు. అదేమిటని ప్రశ్నిస్తే ఆమెను చితక్కొట్టిన సురేష్ అప్పటి నుంచి ఆమె వద్దకు వెళ్లడం మానేశాడు.

దీంతో తనకు న్యాయం చేయాలని దీపిక జూలై 27న మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ముందుగా సురేష్ ను పిలిచి కౌన్సిలింగ్ నిర్వహించారు. అయినా కూడా సురేష్ మారకపోవడంతో అతని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.