ఇద్దరు పిల్లల గొంతు కోసి చంపి ఆత్మహత్య చేసుకున్న తండ్రి

అల్లారు ముద్దుగా పెంచుకున్న తండ్రే ఆ పిల్లల పాలిట యముడయ్యాడు. చేయి పట్టి నడిపిన ఆ చేతులే వారికి యమపాశాలయ్యాయి. దీంతో ఆ చిన్నారులకు ఎనిమిదేళ్లలోనే నూరేళ్లు నిండాయి. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో రమణమూర్తి, కోటి లక్ష్మీ దంపతులు కిరాయి ఇంట్లో ఉంటున్నారు. వీరికి నాగదినేష్, సాయి అనే కుమారులున్నారు. భార్య భర్తల మధ్య గత కొంత కాలంగా వివాదాలు నడుస్తున్నాయి. రమణ మూర్తి విజయవాడలో ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. బుధవారం రాత్రి భార్య భర్తలకు మధ్య మరోసారి వివాదం జరిగింది.

దీంతో కోపంతో కోటి లక్ష్మీ అమ్మగారింటికి వెళ్లింది. ఆ తర్వాత కోపోద్రిక్తుడైన రమణ మూర్తి తలుపులు పెట్టి తన ఇద్దరు కుమారులను కత్తితో గొంతు కోసి చంపాడు. ఆ తర్వాత తాను ఫ్యాన్ కు ఉరేసుకొని చనిపోయాడు. ఉదయం పక్కింటి వారు వెళ్లగా ఈ దారుణం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.