Crime News: బాచుపల్లి ఓ కళాశాల హాస్టల్లో విద్యార్ధి అనుమానాస్పద మృతి.. ఏం జరిగింది అంటే.!

Crime News: మేడ్చల్ జిల్లా బాచుపల్లి లో వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి బీటెక్ మొదటి ఏడాది చదువుతున్న విద్యార్ధి శివనాగు.. సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చర్చనీయాంశమైంది. ప్రేమ విఫలం కావడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ లో రాసాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ విచారణలో అసలైన ట్విస్ట్ ఒకటి వెలుగు చూసింది.

వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కళాశాల హాస్టల్ పై నుండి దూకి యువకుడు ఆత్మ హత్య చేసుకున్నాడని కాలేజ్ సిబ్బంది చెప్తున్నారు. ఘటన జరిగిన వెంటనే శివనాగు తల్లిదండ్రులకి గాని, బంధువులకు గాని సమాచారం ఇవ్వకుండానే మిగతా తంతుని కాలేజీ యాజమాన్యం కానిచ్చేసింది. ఈ ఘటన పై శివనాగు తల్లి దండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని.. కాలేజీలోనే ఏదో జరిగిందని అంటున్నారు. సూసైడ్ నోట్ లో ఉన్న చేతివ్రాత శివనాగు హ్యాండ్ రైటింగ్ ఒకటి కాదు అని అన్నారు.

కావాలనే కాలేజీ యాజమాన్యమే తమ బిడ్డను చంపేసి… బిల్డింగ్‌పై నుంచి పడేశారని ఆరోపించారు. జాతి పేరుతో తనను దూషించి, తక్కువ కులం వాడు ఎక్కువ చదువులు చదవకుండా చంపేశారని తీవ్ర ఆరోపణలు చేశారు శివనాగు తల్లిదండ్రులు. ఈ పరిస్థితుల్లో వీఎన్‌ఆర్‌ కాలేజీ వద్ద భద్రతను పెంచారు పోలీసులు. అక్కడ ధర్నా చేస్తున్న విద్యార్థులను, శివనాగు బంధువులను అక్కడి నుంచి పంపించేశారు. కేసు దర్యాప్తు జరుగుతోందని.. నిజంగా శివనాగు హత్యకు గురై ఉంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు చెప్పారు.