అయేషా మీరా హత్య కేసులో ముగ్గురి పై ఎఫ్ఐ ఆర్ నమోదు

విజయవాడలో 2007 లో శ్రీ దుర్గా లేడిస్ హస్టల్ లో దారుణ హ్యతకు గురైన  అయేషా మీరా హత్య కేసును సిబిఐ విచారిస్తుంది. అయితే విచారణలో స్పీడ్ పెంచిన సీబీఐ ముగ్గురు కోర్టు ఉద్యోగుల పై కేసు నమోదు చేసింది. కోర్టులో భద్రపరిచిన సాక్ష్యాలను ధ్వంసం చేసిన వ్యవహారంలో సిబిఐ విజయవాడ జిల్లా కోర్టు ఉద్యోగుల పై కేసు నమోదు చేసింది. ఈ కేసులో సాక్ష్యాలను రూపుమాపి దోషులను రక్షించేందుకు యత్నించారని సిబిఐ ఎఫ్ ఐ ఆర్ లో పేర్కొంది.   

ఏపీ పోలీసులు చేసిన సిట్ విచారణ పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు విచారణను సిబిఐకి అప్పగించింది. ఈ కేసు విచారణలో పూర్తి స్వేచ్చగా వ్యవహరించ వచ్చని కోర్టు సీబిఐ కి సూచించింది. ముగ్గురు ఉద్యోగుల పై కేసు నమోదు చేసిన సిబిఐ త్వరలోనే అయేషా మీరా తల్లిదండ్రులు, సత్యం బాబు (ఆయేషా హత్యకేసులో నిర్దోషిగా విడుదలయ్యాడు) ను విచారించనుంది.

2007 డిసెంబర్ 27న విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలోని శ్రీ దుర్గా లేడీస్ హాస్టల్ లో ఉంటున్న అయేషా మీరా పై గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేశారు. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న సత్యంబాబును అరెస్ట్ చేసి విచారించారు. అయితే విచారణ ఎదుర్కొని జైలు శిక్ష అనుభవించిన సత్యం బాబు అసలు దోషి కాదని హైకోర్టు తేల్చింది. దీంతో అతనిని నిర్దోషిగా విడుదల చేసింది. అసలు దోషులను పట్టుకునేందుకు సిబిఐకి హైకోర్టు కేసును అప్పగించింది.