బాలీవుడ్ జేజ‌మ్మ‌గా ల‌క్కీ ఛాన్స్ ఎవ‌రికి?

జేజ‌మ్మ‌గా క‌రీనా లేదంటే అనుష్క‌శ‌ర్మ‌

తెలుగులో దాదాపు ప‌దేళ్ల క్రితం వ‌చ్చిన చిత్రం `అరుంధ‌తి`. అనుష్క‌ని మ‌రో కోణంలో ఆవిష్క‌రించి బాక్సాఫీస్ క్వీన్ ని చేసిన చిత్ర‌మిది. శ్యామ్ ప్ర‌సాద‌రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన ఈ చిత్రం ఆయ‌న‌కు కాసుల వ‌ర్షం కురిపించింది. జేజ‌మ్మ‌గా, స్వీటీగా రెండు పాత్ర‌ల్లోనూ అనుష్క అద‌ర‌గొట్టింది. ఈ సినిమా విడుద‌లై ప‌దేళ్లవుతున్నా ఇప్ప‌టికీ అనుష్క‌ని చూస్తే జేజ‌మ్మ పాత్రే గుర్తొస్తుంది. అంత‌గా ఆక‌ట్టుకున్న ఈ చిత్రాన్ని త్వ‌ర‌లో హిందీలో రీమేక్ చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. గ‌తంలో ఈ సినిమా బాలీవుడ్ రీమేక్ హ‌క్కుల్ని భారీ మొత్తానికి ఓ నిర్మాణ సంస్థ సొంతం చేసుకుంది. కానీ తెర‌పైకి తీసుకురాలేక‌పోయింది.

తాజాగా `బాహుబ‌లి` స‌హా ద‌క్షిణాది సినిమాల హ‌వా చూశాక‌ `అరుంధ‌తి`ని రీమేక్ చేయాల‌ని రెండు నిర్మాణ సంస్థ‌లు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టాయ‌ని తెలిసింది. ఇందులో అనుష్క పాత్ర కోసం మేక‌ర్స్ ముందు క‌రీనా క‌పూర్‌ని అనుకున్నార‌ట‌. ఆమె కుద‌ర‌క‌పోతే అనుష్క శ‌ర్మ‌ని రంగంలోకి దించాల‌ని భావిస్తున్నార‌ని బాలీవుడ్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. డాన్స్ ఇండియా డాన్స్ కార్య‌క్ర‌మానికి క‌రీనా న్యాయ నిర్ణేత‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. దీంతో పాటు క‌ర‌ణ్ జోహార్ నిర్మిస్తున్న `త‌క్త్`, అంగ్రేజీ మీడియం, గుడ్ న్యూస్ చిత్రాల్లో న‌టిస్తోంది. అవి పూర్త‌యితే గానీ `అరుంధ‌తి` రీమేక్‌కు డేట్స్ కేటాయించ‌దు. అనుష్కశ‌ర్మ మాత్రం ప్ర‌స్తుతం ఖాళీగా వుంది. అన్నీ స‌వ్యంగా కుదిరితే ఆమెనే `అరుంధ‌తి` రీమేక్ కోసం జేజ‌మ్మ‌గా ఖ‌రారు చేసే అవ‌కాశం వుంద‌ని తెలిసింది.