సుషాంత్ మ‌ర‌ణం లో కొత్త ట్విస్ట్..ఎవ‌రి మెడ‌కు?

బాలీవుడ్ న‌టుడు సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య‌పై కుటుంబ స‌భ్యులు స‌హా, ప‌లువురు బాలీవుడ్ సెల‌బ్రిటీలు అనుమానం వ్య‌క్తం చేయడంతో కేసును ముంబై పోలీసులు స‌మ‌గ్రంగా ద‌ర్యాప్తు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే 40 మందిని విచారించి వాంగ్ములం తీసుకున్నారు. ఇందులో సుషాంత్ గ‌ర్ల్ ప్రెండ్ రియా చ‌క్ర‌వ‌ర్తి కూడా ఉంది. అయితే తాజాగా ఈ కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. రియా చ‌క్ర‌వ‌ర్తిపై సుషాంత్ తండ్రి కేకే సింగ్కే బిహార్ లో పోలీస్ కేసు పెట్టారు. ఆర్ధికంగా సుషాంత్ ని రియా వాడుకుంద‌ని, సుషాంత్ మాన‌సిక క్షోభ‌కు గుర‌వ్వ‌డానికి కూడా కార‌ణం రియా అని ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీంతో పాట్నా పోలీసులు రియా చక్రవర్తి పైన పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసారు. ఇటు రియా చ‌క్ర‌వ‌ర్తి కూడా జులై మొద‌టి వారంలో సీబీఐ విచార‌ణ చేప‌ట్టాల‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ఇన్ స్టా గ్రామ్ వేదిక‌గా కోరింది. సుషాంత్ జూన్ 14న త‌న నివాసంలో ఉరేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. అప్ప‌టి నుంచి కేసుపై విచారణ జ‌రుగుతోంది. ఇంత‌లో రియా సీబీఐ ద‌ర్యాప్తు కోర‌డం..అటు సుషాంత్ కుటుంబ స‌భ్యులు తాజాగా రియాపై కేసు పెట్ట‌డం చూస్తుంటే అనుమా నాలకు తావిస్తోంది. సుషాంత్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి కార‌ణం ప్రియురాలా? ఫ‌్యామిలీనా? అని సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి.

అదీ నెల రోజులు దాటిపోయిన త‌ర్వాత ఈ కేసుల గురించి కుటుంబం మాట్లాడ‌టం…రియా ద‌ర్యాప్తు అన‌డం ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్ప‌టివ‌ర‌కూ సుషాంత్ మ‌ర‌ణానికి ప్ర‌ధాన కార‌ణంగా నెపోటిజం(బంధుప్రీతి) ఎక్కువ‌గా వినిపించింది. సుషాంత్ ని బాలీవుడ్ లో ఎద‌గ‌నీయ‌కుండా కొంత మంది పెద్ద‌లు అడ్డు ప‌డుతున్నారని…ఆ మాన‌సిక స్థితిని త‌ట్టుకోలేక సూసైడ్ చేసుకున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం సాగింది. ఈ నేప‌థ్యంలో ప‌లువురు సెల‌బ్రిటీల్ని ముంబై పోలీసులు విచారించిన సంగ‌తి తెలిసిందే.