తెలుగు సినిమాతో కాదర్ ఖాన్ అనుబంధం

ఈరోజు ఉదయం కెనడాలో మృతి చెందిన హిందీ నటుడు , రచయిత కాదర్ ఖాన్ దక్షిణ భారత సినిమాకు ఎంతో సన్నిహితుడు . ముఖ్యంగా తెలుగువారు హిందీలో నిర్మించిన ఎన్నో చిత్రాల్లో నటించడమే కాకుండా రచన చేశాడు .
దాసరి నారాయణ రావు, తాతినేని రామారావు , మురళీ మోహన్ రావు, రాఘవేంద్ర రావు , కె . బాపయ్య దర్శకత్వం వహించిన సినిమాలకు పని చేశాడు .

మేరీ ఆవాజ్ సునో , హిమ్మత్ వాలా , అనారీ , జ్యోతి బనే జ్వాల , జస్టిస్ చక్రవర్తి , తోఫా , మస్కాడ్ . గిరఫ్తార్, దిల్వాల , రాక్ వాలా , సూర్యవంశం మొదలైన సినిమాలను పేర్కొనవచ్చు . కాదర్ ఖాన్ తెలుగు , సంస్కృతీ , సంప్రదాయాలను బాగా ఆకళింపు చేసుకునేవాడు . విజయవంతమైన తెలుగు సిన్మాలను హిందీలో పునర్నిర్మించేవారు .

ఇలాంటి సినిమాలకు డైలాగ్స్ తో పాటు చక్కటి పాత్రల్లో కాదర్ ఖాన్ నటించేవాడు . హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా 15 లేదా 20 రోజులు తప్పకుండా ఉండేవాడు . ఆరోజుల్లో అన్నపూర్ణ , పద్మాలయ స్టూడియోల్లో తప్పకుండా కనిపించేవాడు .
కాదర్ ఖాన్ నటుడుగా ఎంత ప్రతిభావంతుడో రచయిత గా కూడా పదునైన మాటలతో , హాస్యోక్తులతో ప్రేక్షకులను గిలిగింతలు పెట్టేవాడు .

హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన అందరితో సరదాగా ఛలోక్తులతో మాట్లాడేవాడు . తెలుగు వంటకాలంటే అమితమైన ఆసక్తి . ఇక మధ్యాహ్న భోజనంలో కూడా వివిధ రకాలైన విజిటేరియన్, నాన్ విజిటేరియన్ వంటకాలు ఉండేవి .
ఎక్కడో ఆఫ్గనిస్తాన్ లోని కాబులో జన్మించిన కాదర్ ఖాన్ చదువు అనంతరం తనకిష్టమైన సినిమా రంగాన్ని ఎన్నుకున్నాడు . జవానీ దివాని సినిమా తో రచయితగా సినిమా రంగంలో ప్రవేశించాడు . 1973లో “డాగ్ “సినిమాతో నటుడయ్యాడు .

కాదర్ ఖాన్ 300 సినిమాలకు పైగా నటించాడు . 200 చిత్రాలకు పైగా మాటలు రాశాడు . ఆయన మోకాలు చికిత్స కోసం కుమారుడు సఫారాజ్ ఖాన్ కెనడాలో ఉంటే వెళ్ళాడు . ఆ ఆపరేషన్ విజయవంత అయినా ఆయన లేచి నడవలేకపొయ్యాడు . కోలుకుంటాడని కుటుంబ సభ్యులు భావించినా ఊహించని విధంగా కాదర్ ఖాన్ కు మంగళవారం నాడు హఠాత్తుగా గుండె పోటురావడం తో చివరి శ్వాస తీసుకున్నాడు .
కాదర్ ఖాన్ మృతి భారతీయ సినిమా రంగానికి తీరని లోటు .