ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో బీజేపీ నాయకులపై విరుచుకు పడిన వైనంపై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి. చంద్రబాబును విప్ చింతమనేని ప్రభాకర్తో పోల్చుతున్నారు జనం. అగ్నికి ఆజ్యం పోసినట్టు- చంద్రబాబు కాన్వాయ్కు అడ్డుపడినందున కొందరు టీడీపీ నాయకులు ఏకంగా గుంటూరులో కన్నా లక్ష్మీనారాయణ ఇంటిపైకి దండెత్తడాన్ని తప్పుపడుతున్నారు.
ఇదే విషయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్య అత్యవసరం అంటే ప్రశ్నించిన వారిని ఫినిష్ చేయడమేనా? అంటూ విమర్శించారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్ చేశారు. పోగాలం దాపురించిన వారికి ఏమీ కనిపించవని ఎద్దేవా చేశారు. అసలు ప్రతిపక్షమే లేకుండా ఫినిష్ చేస్తానని గతంలో చంద్రబాబు అసెంబ్లీలో బెదిరించిన విషయాన్ని విజయసాయి రెడ్డి గుర్తు చేశారు.
`ప్రశ్నించిన వారిని ఫినిష్ చేయడమే చంద్రబాబుకు తెలిసిన డెమోక్రాటిక్ కంపల్షన్ కాబోలు! ప్రతిపక్షం లేకుండా ఫినిష్ చేస్తానని నాడు అసెంబ్లీలో బెదిరించిన బాబు, ఇప్పుడు చింతమనేని స్థాయికి దిగజారి, ప్రశ్నిస్తే మహిళలను కూడా ఫినిష్ చేస్తానంటున్నాడు. పోగాలం దాపురించిన వాడు వినడు. కనడు.` అని విజయసాయి రెడ్డి ట్విట్టర్లో రాశారు.
పోలవరం సహా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పలు ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల్లో అవినీతి పెచ్చరిల్లిందంటూ కాకినాడలో చంద్రబాబు కాన్వాయ్ను కొందరు బీజేపీ నాయకులు అడ్డగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తనతో పెట్టుకున్న వారు ఫినిష్ అయిపోతారని వార్నింగ్ ఇచ్చారు.