పవన్ కళ్యాణ్‌పై వైసీపీ నేతల ‘ఆయాసం’తో ప్రయోజనమేంటి.?

మాజీ మంత్రి పేర్ని నాని, మంత్రి గుడివాడ అమర్నాథ్, మరో మంత్రి దాడిశెట్టి రాజా.. ఇలా చాలామంది వైసీపీ నేతలు మీడియా ముందుకొచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని మీడియా సాక్షిగా చెడామడా తిట్టేశారు. ‘రోజా ఓ సినీ నటి.. మీ ఇంట్లో ఆడ పిల్లలు కూడా సినిమాల్లో వున్నారు కదా.. డైమండ్ రాణి అని ఎలా అనగలిగావ్ రోజాని.? మహిళల పట్ల నీ ఉద్దేశ్యాలు ఇవేనా.?’ అంటూ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు.

రాజకీయాల్లో కులం కార్డు, మతం కార్డు, జెండర్ కార్డు.. ఇలాంటివి ఎవరికి అనుకూలంగా వారు తెరపైకి తెస్తుంటారంతే. మహిళా నేతనన్న భావన రోజాలో ఏనాడైనా వుందా.? ఆమె తన స్థాయిని మరిచి, రాజకీయ ప్రత్యర్థుల్ని తూలనాడలేదా.? చంద్రబాబు సతీమణిపై వైసీపీ నేతలు తూలనాడినప్పుడు ఈ పేర్ని నాని ఏమైపోయారు.?

గుడివాడ అమర్నాథ్ కావొచ్చు, దాడిశెట్టి రాజా కావొచ్చు.. మరొకరు కావొచ్చు. మీడియా ముందు గుస్సా అయినంతమాత్రాన పవన్ కళ్యాణ్‌లో మార్పు రాదు. ఎందుకంటే, వీళ్ళనలా మీడియాకి లాగడమే పవన్ కళ్యాణ్ ఎజెండా. ఆ ఎజెండాలో ఆయన సక్సెస్ అవుతున్నాడు.

ఐటీ శాఖకు సంబంధించి అమర్నాథ్ మీడియా ముందుకు రారు.. పర్యాటక శాఖ గురించి మంత్రి రోజా మీడియా ముందకు రారు.. పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ అంబటి రాంబాబు మీడియా ముందుకు రారు.. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే.

వాటినే పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఆయా మంత్రులకు ఇదో మంచి ఛాన్స్. కానీ, ఆయా శాఖల గురించి మాట్లాడటంలేదు. కేవలం పవన్ కళ్యాణ్‌ని తిట్టడానికే మంత్రులు మీడియా ముందుకొస్తున్నారన్న పవన్ కళ్యాణ్ విమర్శల్ని, మంత్రులు నిజం చేస్తుండడం ఆశ్చర్యకరమే. వీళ్ళంతా వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ పార్టీకి మేలు చేస్తున్నట్టా.? కీడు చేస్తున్నట్టా.?