ఆయ‌న చంద్ర‌బాబు వ‌దిలిన బాణం: వైఎస్ఆర్‌సీపీ

ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ‌దిలిన బాణం ఏమిటో మ‌న‌కు తెలుసు. తాను జ‌గ‌న్ అన్న వ‌దిలిన బాణాన్ని అంటూ ఆయ‌న సోద‌రి వైఎస్ ష‌ర్మిల చెప్పుకొంటారు. అదే నినాదంతో ఆమె పాద‌యాత్ర నిర్వ‌హించారు. ఇప్పుడు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కూడా ఓ బాణాన్ని వ‌దిలారంటూ విమ‌ర్శ‌లు చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.

ఆ బాణ‌మే సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మణ అని ఆరోపిస్తోంది. 18 స్టేలు రావ‌డానికి సాయం చేసిన వారిలో ర‌మ‌ణ ఒక‌ర‌ని, చంద్ర‌బాబుకు యాక్ష‌న్‌, డైరెక్ష‌న్ అన్ని ఆయ‌నే అని విమ‌ర్శిస్తోంది. వైఎస్ జ‌గ‌న్‌పై విశాఖ‌ప‌ట్నం విమానాశ్ర‌యంలో జ‌రిగిన హ‌త్యాయ‌త్నం ఘ‌ట‌న‌పై జాతీయ ద‌ర్యాప్తు సంస్థ విచార‌ణ చేప‌ట్టింది.

ఈ విచార‌ణ జ‌ర‌గ‌కుండా స్టే ఇవ్వాలంటూ ప్ర‌భుత్వం హైకోర్టును ఆశ్ర‌యించింది. దీనిపై స్టే ఇవ్వ‌డానికి హైకోర్టు అంగీక‌రించ‌లేదు. దీనికి సంబంధించిన పిటీష‌న్‌ను తోసిపుచ్చింది. దీనితో న్యూఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ఎన్వీ ర‌మ‌ణ‌తో భేటీ అయ్యారంటూ వ‌చ్చిన వార్త‌ల‌పై వైఎస్ఆర్ సీపీ స్పందించింది.