అన్నీ అవమానాలే, అందుకే వైసిపికి గుడ్ బై చెప్పా

పార్టీలు మారడం టిపిన్ సెంటర్ కెళ్లి టీ తాగొచ్చినంత సులభమయింది.ఎవరు ఎందుకు మారుతున్నారో అందరికి తెలిసిందే. అయినా సరే పార్టీలు జంప్ జిలానీలు రావడాన్ని తమ గొప్పగా, తమ పార్టీ గెలుపు సంకేతంగా, ‘ఎగస్పార్టీ’ దివాళకోరు గా  చెప్పుకుంటున్నాయి.

తమాషా ఏమంటే, ప్రతిపక్ష పార్టీనుంచి రూలింగ్ పార్టీలోకి రావడం, రూలింగ్ నుంచి అపోజిషన్ లోకి వెళ్లడం ఒక నెల రోజులుగా జోరందుకుంది. ప్రతిపక్ష పార్టీలోకి రూలింగ్ పార్టీ వాళ్లు రావడాన్ని మునిగే నావ నుంచి బయటపడుతున్నారన్నట్లు వైసిపి చెప్పాలనుకుంటున్నది. అందుకే ఆ పార్టీ ప్రతిచేరికను గొప్ప ఈవెంట్ గా మార్చుకుని టిడిపి పని అయిపోయిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నది. అయితే, టిడిపి  కూడా వైసిపి నుంచి పెద్ద ఎత్తున లీడర్లను చేర్చుకుంటూ కౌంటర్ ప్రచారం మొదలుపెట్టింది.  వైసిపిలో తనకు అవమానం జరిగిందని, అక్కడసలు ప్రజాస్వామ్యమే లేదని చెబుతూ చాలా మంది టిడిపిలోకి వస్తున్నారు.

ఈ రోజు వైసిపి నుంచి ఒక మహిళానేత టిడిపిలోకి వచ్చారు. రోజూ డజన్ల కొద్ది లీడర్లు టిడిపి వదిలేసి వైసిపిలో చేరుతుంటే, ఆ పార్టీ మ‌హిళా రాష్ట్ర విభాగం మాజీ అధ్య‌క్షురాలు కొల్లి నిర్మ‌లాకుమారికి టీడీపీ కండువా కప్పుకున్నారు. నిర్మ‌లా కుమారితో పాటు తూర్పు గోదావ‌రి జిల్లా కొత్త‌పేట నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన చాలా మంది వైసీపీ నేత‌లూ టీడీపీలో చేరారు.

ఐటి మంత్రి నారా లోకేశ్ స‌మ‌క్షంలో ఉండ‌వ‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంప్ కార్యాల‌యంలో శనివారం నాడు వారంతా టీడీపీ కండువా క‌ప్పుకున్నారు.

కొల్లి నిర్మలా కుమారి వైసిపి ఎందుకు వదిలారంటే…

“వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో అవ‌మానాలు భ‌రించ‌లేకే..ఉమెన్స్ డే రోజునే రాజీనామా చేశాను. ద‌శాబ్ద కాలంగా ఆపార్టీ కోసం కోసం అంకితభావంతో ప‌నిచేశాన‌ు. అయినా సరే నేను అడుగ‌డుగునా అవ‌మానాలే ఎదుర్కొన్నాను. ఒక మ‌హిళ ఎన్నో త్యాగాలు చేస్తేగానీ, రాజ‌కీయాల‌లో ఎద‌గ‌లేద‌ు. ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల‌ కోర్చి పార్టీకి సేవ‌లందిస్తే నా ఆత్మాభిమానం దెబ్బ‌తీసేలా వైఎస్ ఆర్ కాంగ్రెస్ నాయకత్వం ప్రవర్తించింది. ఆ పార్టీ మహిళా విభాగం అధ్య‌క్షురాలిగా, కృష్ణా-గుంటూరు జిల్లాల రీజిన‌ల్‌ కోఆర్డినేట‌ర్‌గా ప‌నిచేసిన నాకే ఇంత అవ‌మానం జ‌రిగితే సామాన్యుల ప‌రిస్థితి ఇంకెంత ద‌య‌నీయంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చ‌ు. వైసీపీలో మ‌హిళ‌ల‌కు జ‌రుగుతున్న అన్యాయాల‌ను నిర‌సిస్తూ అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం రోజునే పార్టీకి రాజీనామా చేశాన‌ు. నా ఆత్మ‌గౌర‌వానికి ఎటువంటి ఇబ్బంది రానివ్వ‌ర‌నే ధీమాతో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాను” అని నిర్మ‌లాకుమారి వివరించారు.