వైఎస్ వివేకానందరెడ్డి హత్య? ఆయన మృతి పై అనుమానాలు

వైఎస్ వివేకానంద రెడ్డి హఠాన్మరణం మిస్టరీగా మారింది. వివేకానందను హత్య చేసినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా గుండెపోటుతో చనిపోయినట్టుగా చెప్పినా వివేకానంద రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనిస్తే అతనిని హత్య చేసినట్టుగా తెలుస్తోంది. 

వివేకానంద రెడ్డి రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత ఆయన రూంలో పడుకున్నాడు. ముందుగా వివేకానందరెడ్డి బాత్రూంలో పడి ఉన్నాడని చెప్పినా అతని బెడ్రూంలో కూడా రక్తపు మరకలు ఉన్నాయని తేలింది. బాత్రూంలో రక్తపు మడుగులో వివేకానంద రెడ్డి ఉన్నారు. తల, చేతుల పై బలమైన గాయాలున్నాయి. వీటి  ఆధారంగా వివేకానందరెడ్డిని హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఎఫ్ ఐ ఆర్ కాపీ

వివేకానందరెడ్డి పై దాడి చేసింది ఎవరూ అన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. వివేకానంద రెడ్డి మృతి మిస్టరీగా మారడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. వివేకానందరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం చేసేందుకు కడప రిమ్స్ ఆస్పత్రి నుంచి  వైద్యుల బృందం బయల్దేరింది. వైఎస్ వివేకానంద మృతి పై అనుమానాలున్నాయని పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు ఎఫ్ ఐ ఆర్ నమోదైంది. వివేకానంద రెడ్డి కూతురు కూడా డాక్టరే. దీంతో పోస్టుమార్టం రిపోర్టులు వచ్చిన తర్వాత అసలు నిజాలు బయటపడే అవకాశం ఉంది. వైఎస్ వివేకా పై దాడి జరిగినట్టుగా పోలీసులు తమ దర్యాప్తులో తేల్చినట్టుగా తెలుస్తోంది.