పవన్ కళ్యాణ్‌తో భేటీ అవనున్న వివేకా కుమార్తె సునీత.?

చంద్రబాబు హయాంలో సుగాలి ప్రీతి అనే అమ్మాయి చనిపోయింది. బలవన్మరణం.. అనీ, హత్య అనీ.. దళిత బాలిక సుగాలి ప్రీతి విషయంలో రకరకాల వాదనలు వినిపించాయి. ఆ కేసు ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. సీబీఐకి అప్పగించేశామంటోంది వైసీపీ సర్కారు. సీబీఐ నుంచి ఈ కేసు విషయమై ఇంతవరకు ఎలాంటి స్పందనా రాలేదు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, స్వయంగా సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని నినదించడంతోనే.. వైసీపీ సర్కారు దిగొచ్చి, సీబీఐ విచారణకు సుముఖత వ్యక్తం చేసిందన్నది ఓ వాదన. ఇందులో నిజమెంత.? అన్నది వేరే చర్చ. ఇక, ఇప్పుడు తన తండ్రి మరణానికి సంబంధించి విచారణలో జాప్యం పట్ల వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె త్వరలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని కలవనున్నారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతోన్న ప్రచారం.

ఇందులో నిజమెంత.? అన్న విషయాన్ని పక్కన పెడితే, వచ్చే ఎన్నికల్లో పులివెందులలో వైసీపీకి షాక్ ఇచ్చేలా సునీత రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారన్న ప్రచారమైతే గత కొంతకాలంగా జరుగుతోంది. ఆమె టీడీపీ వైపు వెళతారన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇంతలోనే, జనసేనానితో సునీత భేటీ కాబోతున్నారన్న ప్రచారం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, జనసేన వర్గాలు మాత్రం ఈ ప్రచారంలో నిజం లేదంటున్నాయి. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.