మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి మృతదేహానికి శవపరీక్ష పూర్తి చేశారు. పోలీసులు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. పులివెందుల నివాసానికి వివేకా మృతదేహాన్ని తరలించారు. అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన వివేకానందరెడ్డిది హత్యేనని పోస్ట్మార్టమ్ రిపోర్ట్లో వెల్లడైనట్లు సమాచారం. వివేకాను ఎవరో హత్య చేశారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆయన శరీరం మీద ఏడు కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. పదునైన ఆయుధంతో తల, శరీరంపై ఏడుసార్లు దాడి చేశారు. నుదుటిపై లోతైన రెండు గాయాలు, తొడ భాగంలో గాయం, చేతిపైన మరో గాయం, తల వెనుక భాగంలో మరో గాయం గుర్తించారు.
ఈ కేసులో మాకు కొన్ని ఆధారాలు దొరికాయని ఎస్పీ రాహుల్దేవ్ శర్మ చెప్పారు. లభించిన ఆధారాలతో విచారణ చేస్తామని పేర్కొన్నారు. కేసు సంబంధించి ఎస్పీ మాట్లాడుతూ.. హత్య జరిగిందని భావిస్తున్నాం. తలపై 2, చేతిపై 2 గాయాలున్నాయి. ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. రాత్రి 11.30 గంటల నుంచి ఉదయం 5 లోపు ఏం జరిగిందో తెలుసుకుంటున్నామని వివరించారు. కర్నూలు నుంచి ఫోరెన్సిక్ నిపుణుల బృందం పులివెందులకు రానుంది.
