రామ్ గోపాల్ వర్మ చెప్పబోయే నిజం ఇదేనా.?

ఫిలిం మేకర్ రామ్ గోపాల్ వర్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడు. అంతకు మించి, ఆయనకు తెలుగుదేశం పార్టీ అంటే విపరీతమైన ద్వేషం.! జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అంటే, వల్లమాలిన వెటకారం.!

ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే, వైసీపీ కోసం ‘వ్యూహం’ అనే సినిమా తీయాలనుకున్న రామ్ గోపాల్ వర్మ, అనూహ్యంగా ‘నిజం’ అనే యూ ట్యూబ్ ఛానల్ మొదలు పెట్టాడు. ఇందులో అన్నీ నిజాలే చెబుతానంటున్నాడు. ముందుగా వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించిన నిజాలు బయటపెడతాడట.

అదీ ఈ రోజే. సాయంత్రం నాలుగు గంటలకు రామ్ గోపాల్ వర్మ చెప్పబోయే నిజాలు ఏంటి.? అన్నదానిపై జనానికీ ఓ అవగాహన వుంది. బహుశా వైఎస్ వివేకానంద రెడ్డిది హత్య కాదు, గుండె పోటుతోనే ఆయన చనిపోయినట్లు ఆర్జీవీ తన ‘నిజం’ ఛానల్ ద్వారా ధృవీకరిస్తాడేమో.!

లేదంటే, నారాసుర రక్త చరిత్ర.. అని కంక్లూజన్ రామ్ గోపాల్ వర్మ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇవేవీ కాదు, ఇంకేవైనా కొత్త పాత్రలు ప్రచారంలోకి తెచ్చినా తెస్తాడు ఆర్జీవీ. కేవలం రాజకీయాలే కాదట, సినిమా సహా అనేక అంశాలపై ‘నిజం’లో ఇంటర్వ్యూలు వుంటాయట.

సీనియర్ జర్నలిస్టు స్వప్న కూడా ఈ ఇంటర్వ్యూలు చేస్తుందట. ఆర్జీవీ కూడా ఇంటర్వ్యూలు చేస్తాడట. ఆర్జీవీ ఏం చేసినా సంచలనమే.! కానీ, అది ఒకప్పుడు.! ఇప్పుడైతే జస్ట్ టైమ్ పాస్ కామెడీ అంతే.!