పవన్ కళ్యాణ్‌పై వైఎస్ జగన్ సర్కారు సీరియస్ యాక్షన్.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వాలంటీర్లు, పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. పలు చోట్ల వాలంటీర్లు, పోలీసులకు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులు చేయడం కూడా చేశాం.

ఇప్పుడు నేరుగా ప్రభుత్వమే రంగంలోకి దిగింది. పవన్ కళ్యాణ్‌ని ప్రాసిక్యూట్ చేసేందుకు వీలుగా ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఇప్పటికే రాష్ట్ర మహిళా కమిషన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి నోటీసులు జారీ చేయగా, ఆ నోటీసులకి జనసేనాని స్పందించలేదు.

ఇప్పుడిక ప్రాసిక్యూషన్ గనుక రంగంలోకి దిగితే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదుపరి కార్యాచరణ ఎలా వుంటుందన్నది సస్పెన్స్‌గా మారింది. పవన్ కళ్యాణ్ మాత్రం, ‘మీకు చేతనైంది చేసుకోండి.. నేనైతే వెనక్కి తగ్గను’ అంటున్నారు.

‘ఇక్కడే నీ పతనం మొదలైంది జగన్..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తనపై ప్రాసిక్యూషన్‌కి జగన్ సర్కారు సిద్ధమవడానికి సంబంధించి వ్యాఖ్యానించడం గమనార్హం. ‘నన్ను అరెస్టు చేస్తారో.. చిత్ర హింసలు పెట్టుకుంటారో.. మీ ఇష్టం.. నేను మాత్రం వెనక్కి తగ్గను..’ అంటూ జనసేనాని చెప్పడం అందర్నీ విస్మయానికి గురిచేసింది.

ఇంతకీ, ప్రాసిక్యూషన్ పేరుతో జగన్ సర్కారు ఏం చేయబోతోంది.? పవన్ కళ్యాణ్‌ని అరెస్టు చేస్తుందా.? అరెస్టు చేస్తే, తద్వారా తలెత్తే అలజడిని వైసీపీ సర్కారు అదుపు చేయగలుగుతుందా.? వేచి చూడాల్సిందే.