డిజిపి ఆర్పీ ఠాకూర్ బదిలీ తప్పదా ? చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఉన్నతాధికారుల్లాగ కాకుండా చంద్రబాబునాయుడుకు సన్నిహితుల్లాగ, తెలుగుదేశంపార్టీలోని కీలక నేతల్లాగ వ్యవహరిస్తున్న ఠాకూర్, ఇంటెలిజెన్స్ ఐజి వెంకటేశ్వరరావు, డిఐజి ఘట్టమనేని శ్రీనివాస్ ను వెంటనే బదిలీ చేయాలని వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈరోజు కేంద్ర ప్రధాన ఎన్నికల కమీషనర్ ను కలిసిన జగన్ రాష్ట్రంలోని నకిలీ ఓట్లపై ఫిర్యాదు చేస్తూనే పై అధికారుల విషయంలో కూడా పెద్ద కంప్లైంటే పెట్టారు. ఠాకూర్, వెంకటేశ్వరరావులపై జగన్ ఫిర్యాదు చేశారని కాదు కానీ వారిపై టిడిపి ముద్ర ఎప్పుడో పడిపోయింది.
ఉన్నతాధికారులపై అధికారపార్టీ ప్రభావం ఉంటుందన్న విషయం అందిరికీ తెలిసిందే. మరీ మాంసం తింటున్నామని ఎముకలు మెడలో వేసుకుని తిరగలేం కదా ? కానీ పై ముగ్గురు ఐపిఎస్ అధికారుల వ్యవహారం సృతిమించి పోయింది. చంద్రబాబునాయుడును మెప్పించటానికే తమ డ్యూటీలు చేస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. విశాఖపట్నం విమాయాశ్రయంలో జగన్ పై హత్యాయత్నం జరిగినపుడు ఠాకూర్ ఆడిన డ్రామాలు అందరూ చూసిందే. హై కోర్టు ఆదేశాలతో ఎన్ఐఏ విచారణ చేపట్టినా ఇప్పటికీ సిట్ విచారణ తాలూకు రికార్డులను ఎన్ఐఏకి ఇవ్వకుండా డిజిపినే తొక్కిపట్టారని జగన్ సీఈసీ ఫిర్యాదులు పేర్కొన్నారట.
ఇక, ఇంటెలిజెన్స్ ఐజి వెంకటేశ్వరరావు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. వైసిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలు టిడిపిలోకి ఫిరాయించటంలో వెంకటేశ్వరావుదే కీలక పాత్రగా వైసిపి ఎప్పటి నుండో ఆరోపిస్తోంది. వెంకటేశ్వరరావు పోలీసు అధికారిగా కాకుండా కేవలం టిడిపి నేతగానే వ్యవహరిస్తున్నట్లు మండిపోతోంది. మొన్నటి తెలంగాణా ఎన్నికల్లో కూడా ఏపి పోలీసులు తెలంగాణాలో చేసిన ఓవర్ యాక్షన్ తాలూకు క్లిప్పింగులను కూడా జగన్ సీఈసీకి ఇచ్చిన ఫిర్యాదులు పేర్కొన్నారట.
ఏ ప్రభుత్వంలో అయినా ఇంటెలిజెన్స్ ఐజిదే కీలక పాత్ర ఉంటుంది. కానీ అధికారులు అధికారులుగానే ఉండాలి. అంతకానీ అధికార, పార్టీ మధ్య ఉన్న సరిహద్దును దాటితే ఠాకూర్, వెంకటేశ్వరరావు, ఘట్టమనేని శ్రీనివాస్ లాగే అందరి నోళ్ళలో పడాల్సుంటుంది. జగన్ దెబ్బకు ఠాకూర్ బదిలీ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నది ఇన్ సైడ్ టాక్. మరి ఏం జరుగుతుందో చూడాల్సిందే.
