జగన్ ఆస్తుల కేసులో కొత్త ట్విస్ట్.. సీనులోకి వైఎస్ భారతి

వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో మొట్టమొదటిసారిగా ఆయన భార్య భారతిపై అభియోగాలు నమోదయ్యాయి. జగన్ ఆస్తుల కేసులకు సంబంధించిన ఛార్జ్ షీటులో ఆయన భార్య భారతి పేరును ఈడీ చేర్చింది.భారతీ సిమెంట్ కు సంబంధించి హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీటులో ఆమెను ఏ5గా చేర్చారు. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద ఈ అభియోగపత్రం దాఖలు చేశారు.

ఇప్పటికే ఈ కేసులో జగన్, విజయసాయిరెడ్డి, భారతి సిమెంట్ కార్పొరేషన్, జే. జగన్మోహన్ రెడ్డి, సిలికాస్ బిల్డర్, సండూర్ పవర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లపై సీబీఐ చార్జీ షీటు వేసింది. సీబీఐ గతంతో వేసిన 11 ఛార్జ్ షీట్లలో భారతీ పేరు లేకపోగా.. తాజాగా ఆమె పేరును ఈడీ చేర్చడం చర్చనీయాంశంగా మారింది.

జగన్ అక్రమాస్తుల కేసులో రూ. 750 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్ లో రూ. 5 వేల కోట్లకు పైగానే ఉందని తెలుస్తోంది. ఇప్పటికే నాలుగు విడతలుగా ఈడీ జగన్ ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఇందులో మొదటి విడతగా 200 కోట్లు, రెండవ విడతగా 43 కోట్లు, మూడవ విడతలో 225 కోట్లు, నాలుగో విడుతలో 750 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

రఘురామ్ సిమెంట్స్ ఒప్పందంలో వైఎస్ భారతి అనే పేరుతో డబ్బులు లావాదేవిలు జరిగాయని ఈడీ పేర్కొంది. రఘురామ్ భారతి సిమెంట్ లో సండూర్ పవర్, కారమేల్ ఏషియా లిమిటెడ్, ఇతర కంపెనీలు హవాలా ద్వారా నిధులు మళ్లించినట్ట ఈడీ ఆరోపించింది. PMLA చట్టం సెక్షన్ 3 కింద నిందితులను ప్రత్యేక కోర్టు శిక్షించాలని ఈడీ కోరింది.మెత్తానికి వైఎస్ భారతి మీద అభియోగం మోపడం చర్చనీయాంశం అయ్యింది.