వైసీపీ ఎమ్మెల్యేలకు కొత్త కష్టం వచ్చిందిగా.. సీఎం జగన్ ఏం చేస్తారో?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ సంక్షేమ పథకాలకు ఇస్తున్న దానిలో అభివృద్ధికి పదో వంతు కూడా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా వైసీపీ కార్యకర్తలు ప్రభుత్వం నుంచి బిల్లులు మంజూరవుతాయనే ఆశతో సొంతంగా డబ్బులు ఖర్చు చేశారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలను కార్యకర్తలు తమ బిల్లులు తమకు వచ్చేలా చేయాలంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

కోట్ల రూపాయలు ఖర్చు చేసిన కార్యకర్తల నుంచి ప్రశ్నలు ఎదురవుతూ ఉండటంతో వైసీపీ ఎమ్మెల్యేలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. దర్శి వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ తాజాగా ఒక సందర్భంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధి కోసం 20 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని ఆ తర్వాత నేను నియోజకవర్గం కోసం మరో 20 కోట్ల రూపాయల పనులను సాధించానని ఆయన తెలిపారు.

కార్యకర్తలు నియోజకవర్గ అభివృద్ది కోసం సొంత డబ్బులను ఊహించని స్థాయిలో ఖర్చు చేస్తున్నారని ఆయన కామెంట్లు చేశారు. సీఎం జగన్ నిధులను త్వరలోనే రిలీజ్ చేస్తామని చెబుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. వైసీపీ ఎమ్మెల్యేనే స్వయంగా పార్టీలో తనకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి చెప్పడం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం తమ మనస్సులోని బాధను బయటకు చెప్పడం లేదు.

వైసీపీ ఎమ్మెల్యేలను హర్ట్ చేసే విధంగా జగన్ సర్కార్ వ్యవహరించడం కరెక్ట్ కాదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తే ఊహించని మొత్తంలో నష్టపోయే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలలో చాలామంది అటు జగన్ కు చెప్పలేక ఇటు కార్యకర్తలకు నచ్చజెప్పలేక ఇబ్బంది పడుతున్నారు.