Kollu Ravindra: టీడీపీ శ్రేణులకు మంత్రి కొల్లు రవీంద్ర సూచన: “బొట్టుపెట్టి పిలవండి… లక్ష మంది కదలాలి!”

అనంతపురం అర్బన్‌ నియోజకవర్గంలో నిర్వహించనున్న ‘సూపర్‌ సిక్స్‌ సూపర్‌ హిట్‌ సభ’ను విజయవంతం చేయాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నగరంలోని మారుతీనగర్‌ సాయిబాబా గుడి కల్యాణమండపంలో శుక్రవారం అర్బన్‌ టీడీపీ నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి ఇంటికీ వెళ్లి ఆడపడుచులకు బొట్టుపెట్టి సభకు ఆహ్వానించాలని సూచించారు. అనంతపురం అర్బన్‌ నుంచే లక్ష మందికి పైగా హాజరుకావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను మంత్రి కొల్లు రవీంద్ర గుర్తుచేశారు. అందుకే ఎన్నికల్లో కూటమి పార్టీలకు అఖండ విజయాన్ని కట్టబెట్టారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీల మేరకు పింఛన్‌ను రూ.4 వేలకు పెంచినట్లు తెలిపారు. దివ్యాంగుల పింఛన్‌ రూ.3 వేల నుంచి రూ.6 వేలకు, బెడ్‌పై లేవలేని స్థితిలో ఉన్నవారికి రూ.15 వేలు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నవారికి రూ.10 వేలు అందిస్తున్నామని చెప్పారు. ఏడాది కాలంలోనే పింఛన్ల కోసం రూ.35 వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, 16,400 డీఎస్సీ పోస్టుల భర్తీ ప్రక్రియ వంటివి కూటమి ప్రభుత్వమే అందించిందని వివరించారు. ఈ విజయాలన్నింటినీ ప్రజలకు తెలియజేసేందుకే అనంతపురంలో ఈ భారీ సభను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ మాట్లాడుతూ: గత 44 ఏళ్లలో తొలిసారి అనంతపురంలో ఇంతటి భారీ బహిరంగ సభ జరుగుతోందని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమపై ఉంచిన బాధ్యతను విజయవంతంగా నెరవేర్చాలని కోరారు. సభకు 3.5 లక్షల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. టీడీపీ జోన్‌-5 ఇన్‌చార్జ్‌, గుంటూరు మేయర్‌ కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ ఎన్నికల ముందు కష్టపడి కూటమిని గెలిపించారని, ఇప్పుడు ఈ విజయోత్సవ సభను కూడా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

అర్బన్‌ పరిశీలకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 11 సీట్లు వచ్చినా జగన్‌కు బుద్ధి రాలేదని, తిరుమల పవిత్రతను సైతం దెబ్బతీసేందుకు ప్రయత్నించారని, చివరికి టికెట్లు కూడా అమ్ముకున్నారంటూ మండిపడ్డారు. ఈ నెల 10న జరిగే సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఆప్కాబ్‌ చైర్మన్‌ గండి వీరాంజనేయులు మాట్లాడుతూ వైసీపీ నాయకుల ఫేక్‌ ప్రచారాలను టీడీపీ శ్రేణులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త ఈ కార్యక్రమాన్ని ఒక సవాలుగా స్వీకరించి విజయవంతం చేయాలని కోరారు.

ఆర్టీసీ జోనల్‌ చైర్మన్‌ పూల నాగరాజు మాట్లాడుతూ: అనంతపురం ఉమ్మడి జిల్లా టీడీపీకి కంచుకోట అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లింగాయత్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ స్వప్న, టీడీపీ రాష్ట్ర, జిల్లా నాయకులు ఆదినారాయణ, బుగ్గయ్య చౌదరి, రాయల్‌ మురళి, జేయల్‌ మురళి, స్వామిదాస్‌, మదమంచి స్వరూప, డైరెక్టర్లు పీఎల్‌ఎన్‌ మూర్తి, పోతుల లక్ష్మినరసింహులు, బొమ్మినేని శివ, పరమేశ్వర్‌, కొండన్న, నాయకులు సుధాకర్‌నాయుడు, చేపలహరి, సుధాకర్‌ యాదవ్‌, సింగవరం రవి, నెట్టెం బాలకృష్ణ, తేజస్విని, హరి తదితరులు పాల్గొన్నారు.

Krishna Kumari About Kavitha Joining Into BJP..? | BRS | Amit Shah | Telangana | Telugu Rajyam