విశాఖలో ఎన్‌కౌంటర్, మహిళా మావోయిస్టు మృతి

ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో పోలీసుల వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు కాల్చి చంపినప్పటి నుంచి మన్యంలో అలజడి కొనసాగుతూనే ఉంది. శుక్రవారం ఉదయం పోలీసులకు మావోలకు జరిగిన ఎదురు కాల్పుల్లో మహిళా మావోయిస్టు హతమైంది.

ఎమ్మెల్యేను కాల్చి చంపిన తర్వాత మావోలు ఇతర నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు. అప్పటి నుంచి ఏవోబీ సరిహద్దులో పోలీసులు జల్లెడ పడుతున్నారు. శుక్రవారం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోలు కనబడటంతో పోలీసులకు, మావోలకు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో రానా అనే మహిళా మావోయిస్టు మృతి చెందినట్టు విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. అండ్రపల్లి వద్ద ఎదురు కాల్పులు జరిగాయన్నారు. మావోల కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది.