జ‌గ‌న్‌పై దాడి కేసు: నిందితుడి ఖాతాలో డబ్బు జమ చేసిన అమ్మాయి

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన దాడి కేసులో సిట్ దర్యాప్తులో అనేక కోణాలు వెలుగు చూస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ బ్యాంకు ఖాతాలను పరిశీలించారు అధికారులు. కాగా శ్రీనివాస్ కు సంబంధించిన బ్యాంకు అకౌంట్ లో 40000 రూ. ఒకసారి, 20000 ఒకసారి జమ అయ్యాయి. జమ అయిన కొద్దిసేపటికి ఆ డబ్బు వేరే అకౌంట్ కు బదిలీ అయ్యాయి. ఈ డబ్బు ఎవరు వేశారు? ఎవరి అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అయ్యాయి? ఈ విషయాలపై దృష్టి సారించిన అధికారులకు కొన్ని నిజాలు వెల్లడయ్యాయి. ఆ వివరాలు కింద చదవండి.

శ్రీనివాస్ బ్యాంకు అకౌంట్ లో మొదట 40000 జమ అయ్యాయి. ఈ మొత్తాన్ని రమాదేవి అనే ఒక యువతి శ్రీనివాస్ అకౌంట్ లో వేసినట్టు తెలుస్తోంది. అయితే ఆ డబ్బు వేసిన కొద్దిసేపటికి శ్రీనివాస్ అకౌంట్ నుండి వేరే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయ్యాయి. మరో 20000 రూ. కూడా రమాదేవి అనే యువతి శ్రీనివాస్ అకౌంట్ కు పంపింది. అవి కూడా కొద్దిసేపటికి మరో అకౌంట్ కి బదిలీ అయిందని సీపీ మహేష్ చంద్ర లడ్డా వెల్లడించారు.

కాగా శ్రీనివాస్ అకౌంట్ లో డబ్బు చేసిన రమాదేవి…తన సోదరుడికి పంపడం కోసమే డబ్బు జమ చేసినట్టు తెలిపింది. ఆ విషయాల్ని కూడా ఆరా తీస్తున్నట్టు అధికారులు తెలిపారు. అంతే కాదు శ్రీనివాస్ వాడిన తొమ్మిది ఫోన్లలో ఏడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, మరో రెండు ఫోన్లు స్వాధీనం చేసుకోవాల్సి ఉందని అధికారులు చెప్పారు. ఒక ఫోన్ యానాంలో పోగొట్టారని, మరో ఫోన్ ఇద్దరు వ్యక్తుల వద్ద ఉందని శ్రీనివాస్ చెప్పినట్టు అధికారులు తెలిపారు. కానీ ఆ ఫోన్ వారి వద్ద లేదని స్పష్టం చేసారు అధికారులు. నిందితుడితో పని చేసిన వ్యక్తులను విచారించేందుకు ఒక బృందాన్ని మధ్యప్రదేశ్ పంపామని, మరో బృందాన్ని ఒడిశా పంపాల్సి ఉందని వెల్లడించారు.

కాగా వైసీపీ శ్రేణులు మాత్రం సిట్ ఇన్వెస్టిగేషన్ మీద తమకు నమ్మకం లేదని తేల్చి చెబుతున్నారు. నిందితుడిని రోజులు తరబడి విచారిస్తున్నా సహరించట్లేదని మీడియా అంటుంటే, నిందితుడు మాత్రం మీడియాతో ప్రజలతో మాట్లాడే అవకాశం కల్పించండి అని వేడుకుంటున్నాడని…విచారణపై అనుమానం వ్యక్తం చేసారు విజయసాయిరెడ్డి. కుట్రపై మరొక కుట్ర జరుగుతుందంటూ ఆయన అనుమానం వ్యక్తం చేసారు.