ఎమ్మెల్యేల కొనుగోలు మీద ఉన్న ఆసక్తి విద్యార్థుల బతుకుల మీద లేదా?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా తెలంగాణ ఉద్యమం కొనసాగుతుందని గతంలో చాలా సార్లు ఆరోజుల్లో జెఎసి ఛెయిర్మన్ గా ఉన్న ప్రొఫెసర్ కోదండరామ్ అంటూండేవారు.

ఇపుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అపుడు తెలంగాణ .పునర్నిర్మాణం కోసంఉద్యమం కంటిన్యూ అవుతుందని ఆయన అనే వారు. అయితే, ఆయన ఉద్యమం కొద్ది రోజులు సాగింది. ఆయన రైతుల పక్షాన నిలబడ్డారు. ఊరూర తిరిగారు. తెలంగాణ ఏర్పాటు ఆశయాలు నెరవేరలేదని, సాగేది దొరల పాలన అని, ప్రజల తెలంగాణ కోసం పోరాడతానని అన్నారు.

ఆ రోజుల్లో తెలంగాణకోసం విద్యార్థులు బలిదానం చేస్తున్న రోజుల్లో ఆయన ఉద్యమం నడిపారు. ఇపుడుకూడా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో పలువురు నేతలు మరొక తెలంగాణ ఉద్యమం రావాలని అభిప్రాయపడుతున్నారు. ఈ ఉద్యమానికి కూడా ప్రొఫెసర్ కోదండ రామ్ నాయకత్వం వహించాలని కోరుతున్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కోదండరామ్ సాగించిన ఆందోళనకు గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఎదురు దెబ్బ తగిలింది. ఇపుడు 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంతో మరొక సారి కోదండరాం రోడ్డెక్కెందుకు అవకాశం వచ్చింది. మహాధర్నా అని అనకపోయినా, ఒక ధర్నాకు ఆయన పిలుపునిచ్చారు. దీని స్పందన ఎలా ఉంటుందో చూడాలి. మిలియన్ మార్చ్ లాగా జనం వెల్లవలా వచ్చి ఇంటర్ బోర్డు ఎదురుగా ఉన్న ఇరుకురోడ్డులో సాగుతున్నధర్నాని మహాధర్నాగా మారుస్తారా?  తెలంగాణలో మరొక ఉద్యమానికి ఇది నాందిపలుకుతుందా లేక ఇది కేవలం చిన్న నిరసన ప్రదర్శనగా ముగుస్తుందా చూడాలి.

ఇది ఈ రోజు హైదరాబాద్ సోమాజి గూడ ప్రెస్ క్లబ్ లో విద్యార్థి జనసమితి ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్  సమావేశంలో మరొక తెలంగాణ ఉద్యమం అనే భావన వ్యక్తమయింది.

2014 తర్వాత మొన్నమొన్నటి వరకు టిఆర్ ఎస్ లో ఉండి ఇటీవల బయటకు వచ్చిన జి వినోద్ కుమార్ ఈ సూచన చేశాను. ఇంటర్ మార్కుల గోల్ మాల్ తో షాక్ గురై ఎంతో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్న నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతూ ఆయన మరొక తెలంగాణ ఉద్యమ ఆవశ్యకత గురించి మాట్లాడారు.

ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇంటర్ విద్యార్ధులకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఈ విషయాన్నిస్వయాన ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా అంగీకరించారని ఆయన చెప్పారు. ఇంతవరకు 23 మంది విద్యార్ధులలు ఆత్మహత్య చేసుకున్నారని చెబుతూ ఈ ఆత్మహత్యలన్నింటికి ముఖ్యమంత్రి కేసీఆరే బాధ్యత వహించాలని వివేక్ అన్నారు. ఇంటర్ బోర్డు నిర్వాకంపై సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.

విద్యార్ధుల పోరాటం వల్లే తెలంగాణ సాధ్యమయింది. ఇలాంటి చోటు ఈ దుర్ఘటనలు బాధాకరం. ఈ పరిణామాలు అడ్డుకోకపోతే తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుంది. రాష్ట్రంలో వన్ మ్యాన్ రూల్ నడుస్తూ ఉంది, ప్రజాస్వామ్య సంస్థలు చట్టబద్ధంగా నడవడం లేదు. ఇటువంటి పరిణామాలపై కోదండరామ్ అందరినీ ఏకతాటి పైకి తెచ్చి మరో ఉద్యమం చేయవలసిన అవసరం ఉంది,’అని వివేక్ అభిప్రాయపడ్డారు.

ఇంటర్మీడియట్ బోర్డులో జరిగిన అవకతవకలపై ఈ నెల 29 ఒక ధర్నా చేయబోతున్నామని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం చేపడుతున్న ఈ ధర్నాలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, తల్లితండ్రులు పాల్గొనాలని విద్యార్థి సంఘాలకు, ప్రజాస్వామిక సంస్థలకు కోదండరామ్ పిలుపునిచ్చారు. ఆయన ముఖ్యమంత్రి మీద తీవ్రమయిన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు మీద ఉన్న ఆసక్తి ముఖ్యమంత్రికి ఇంటర్ విద్యార్థుల మీద లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు.

గ్లోబరినా ప్రయోజనాల కోసం ప్రభుత్వ విద్యార్థుల జీవితాలతె చెలగాటమాడిందని, ఆ సంస్థ చేసిన అవకతవక వల్ల 9 లక్షల మంది జీవితాలు నాశనం అయ్యాయని అన్నారు.

దీనిని రాష్ట్ర ప్రజల ముందుంచేందుకే 29 న ధర్నాచేస్తున్నామని ఆయన చెప్పారు.

ఈ సమావేశంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు , కొందరు విద్యార్ధి నేతలు కూడా పాల్గొన్నారు.