జనసేనానీ, అప్పుడెందుకు ప్రశ్నించలేదు.?

టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో సంక్షేమ పథకాలకు ‘చంద్రన్న’ పేరు తగిలించినప్పుడు, అప్పట్లో ఆ పార్టీకి మిత్రపక్షంగా చెలామణీ అయిన జనసేన పార్టీ ప్రశ్నించలేకపోయింది. అయితే, ఇప్పుడు వైసీపీ అధికారంలో వున్నప్పుడు మాత్రం, ‘జగనన్న’ పేరుతో సంక్షేమ పథకాలు అమలవుతుండడాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు, తీవ్రంగా తప్పుపడుతున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం మంగళగిరి వచ్చిన పవన్ కళ్యాణ్, అధికార వైసీపీ మీద విరుచుకుపడ్డారు. పేకాట క్లబ్బులు నిర్వహించేవారు, సూట్ కేసు కంపెనీలు నడిపేవారు అధికారంలోకి వస్తున్నారు, అధికారం వెలగబెడ్తున్నారని జనసేన అధినేత ప్రశ్నించిన వైనంపైనా అధికార వైసీపీ మద్దతుదారుల నుంచి సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో ఎదురుదాడి జరుగుతోంది.

చుట్టపు చూపు కింద మూడు నెలలకో, ఆర్నెళ్ళకూ ఆంధ్రప్రదేశ్ వచ్చే జనసేనాని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడటం హాస్యాస్పదం.. అన్న విమర్శలు వినిపించడం సహజమే. అయితే, ఇక్కడ అధికార వైసీపీ కూడా.. సంక్షేమ పథకాలకు సొంత పేర్లు వాడుకోవడంపై ఆత్మవిమర్శ చేసుకోవాల్సి వుంది. సంక్షేమ పథకాలకు తమ పేర్లు పెట్టుకుంటే తప్ప, ప్రజలు తమను గుర్తించరనీ, ఎన్నికల్లో తిరిగి గెలిపించరనీ అధికార పార్టీ భావిస్తోందా.? అంతటి అభధ్రతా భావంతో వుందా.? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అదే సమయంలో, ప్రజల సొమ్ముని.. ప్రజల కోసం ఖర్చు చేస్తూ, సొంత పేర్లు పెట్టుకోవడం సబబు కాదన్న అభిప్రాయాలూ జనబాహుళ్యంలో వినిపిస్తున్నాయి. అయితే, రాజకీయాల్లో వ్యక్తి పూజ అనేది ఎప్పటినుంచో కనిపిస్తున్నదే. ఆ వ్యక్తి పూజలో భాగంగానే, సంక్షేమ పథకాలకు సొంత పేర్లనే ట్రెండ్ బలంగా పాతుకుపోయిందంతే.