ఐకానిక్ టవర్ల శంకుస్ధాపన వెనక అంతుందా ?

చంద్రబాబునాయుడు ఏమి చేసినా చరిత్రే. చంద్రబాబు చేసే ప్రతిదీ దేశంలోనే మొదటిసారి, ప్రపంచంలోనే అత్యుత్తమం. గడచిన నాలుగున్నర సంవత్సరాలుగా ఇలాంటి మాటలు వినివిని జనాల చెవులు తప్పులు పట్టేశాయి. తాజాగా మరో చరిత్రకు శ్రీకారం చుట్టారట చంద్రబాబు. అమరావతిలో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టినట్లు చెప్పుకున్నారు. ఇంతకీ ఆ చరిత్ర ఏమిటంటే, సచివాలయం నిర్మాణాలకు సంబంధించిన రాఫ్ట్ టెక్నాలజీ  పద్దతిలో ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణాలకు శంకుస్ధాపన చేశారు.

 

ఎన్నికలు ముంచుకొస్తున్న నేపధ్యంలో హఠాత్తుగా సచివాలయం నిర్మాణం పేరుతో ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణమంటూ నాటకాలు మొదలుపెట్టారు. రాఫ్ట్ పద్దతిలో శంకుస్దాపన చేయటం దేశంలో మొదటిసారి అంటున్నారు. నిజానికి రాఫ్ట్ ఫౌండేషన్ టెక్నాలజీ పద్దతిలో నిర్మాణాలంటేనే ప్రమాదకరమైన నిర్మాణమని అర్ధం. భూమి బలహీనంగా ఉన్నపుడు భారీ నిర్మాణాలను తట్టుకోలేందు. అటువంటి భూమిలోనే భారీ నిర్మాణాలు చేయాలనుకునే వారు రాఫ్ట్ ఫౌండేషన్ అనే టెక్నాలజీని వాడుతారు. చంద్రబాబు ఇపుడా టెక్నాలజీలోనే ఫౌండేషన్ వేశారు. రాఫ్ట్ ఫౌండేషన్ టెక్నాలజీని వాడటం ఇదే మొదటిసారేమీ కాదు. సచివాలయం నిర్మాణాలకన్నా ముంబాయ్, చెన్నై, బెంగుళూరు, కోల్ కత్తా లాంటి ప్రాంతాల్లో ఈ టెక్నాలజీని ఉపయోగించారు. బహుశా ఏపిలో మొదటిసారేమో ?

 

అమరావతి ప్రాంతంలో భారీ నిర్మాణాలు ఎంతమాత్రం క్షేమం కాదని ఇంజనీరింగ్ నిపుణులు ఎప్పటి నుండో హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే, అమారవతిలో నిర్మాణాలు చేయబోయే ప్రాంతాలంతా భూకంపాలు సంభవించే జోన్లో ఉండటమే కారణం. ఎంత ఆధునిక టెక్నాలజీని వాడినా ప్రకృతి వైపరీత్యాల ముందు ఎందుకు పనికిరావన్న విషయం చాలా సార్లే రుజువైంది. తెరవెనుక జరిగిన ఒప్పందాల కారణంగానే చంద్రబాబు  అభ్యంతరాలను పట్టించుకోకుండా  బారీ నిర్మాణాలు మొదలుపెడుతున్నారు.

 

ఆ శంకుస్ధాపనలనే చంద్రబాబు ఇపుడు దేశంలోనే చరిత్రగా చెప్పుకుంటూ డప్పు కొట్టుకుంటున్నారు. సరే నిర్మాంచబోయే టవర్లు ప్రపంచంలోనే తలమానికమని చెప్పుకుంటున్నారు.  ఒక టవర్ ను 50 అంతస్తులతోనే మిగిలిన నాలుగు టవర్లను తలా 40 అంతస్తులుగా నిర్మించబోతున్నారు. మొత్తం ఐదు టవర్ల నిర్మాణాన్ని 36 నెలల్లో పూర్తి చేస్తారట. అంటే వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందే ఉద్దేశ్యంతోనే  నిర్మాణాల్లో స్పీడు పెంచబోతున్నారు. తాను కాబట్టే రాజధాని నిర్మాణాలను చేపట్టానని టిడిపి గనుక ఓడిపోతే రాజధాని నిర్మాణాలన్నీ ఆగిపోతాయంటూ జనాలను బ్లాక్ మెయిల్ మొదలుపెడతారు. మరి తెలంగాణాలో ఓటర్ల లాగే ఏపిలో కూడా విజ్ఞతతో ఓట్లేస్తారా అన్నది చూడాలి.