ఓటమి భయంతో అందరికి స్నేహ హస్తం అందిస్తున్నారా?

(వి. శంకరయ్య )

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోడీ కి వ్యతిరేకంగా ఎన్ని గాండ్రింపులు ధర్మ పోరాట దీక్షలు సాగిస్తున్నా లోలోపల ఆయనలో గూడు కట్టుకున్న భయం ఇటీవల ఆయన ప్రకటనలు వ్యవహార శైలిలో నగ్నంగా వ్యక్త మౌతోంది. 1)రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావడం కష్టమని తేలి పోయింది. తెలంగాణ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. 2)ఒక వేళ రాష్ట్రంలో అధికారంలోనికి వచ్చి కేంద్రంలోతిరిగి మోడీ ప్రధాని అయితే రాష్ట్రంలో అధికారం అడవిని కాచిన వెన్నెలగా మిగిలి పోతుందనే భయం పట్టుకుంది దీనికి తోడు జాతీయ సర్వేలు పక్కన బెడితే పార్టీ సర్వేలు కూడా అనుకూలంగా లేవని పార్టీ నేతలు ప్రైవేట్ చర్చలలో గింజుకోవడం ఇందుకు నిదర్శనం. 

బిజెపితో చెడిన తర్వాత  ఒక్క రోజు కూడా విరామం ఇవ్వ కుండా కాంగ్రెస్ తో జట్టు కట్టారు. ఒక వేపు నరేంద్ర మోడిని ఒక నేతగా పక్కన పెట్టినా అత్యున్నత మైన ప్రధాని పదవి కూడా లెక్క చేయకుండా నా కన్నా జూనియర్ అని అవహేళన చేశారు. ఇది నెగిటివ్ మార్కులు తెచ్చింది. రాజకీయ పోరాటం స్థానంలో వ్యక్తి గత వైరం తెర మీదకు వచ్చింది. అంత వరకు అయితే ఫర్వాలేదు. రాజకీయా నుభవం అటుంచి వయస్సులో కూడా తన కన్నా ఎంతో చిన్న వాడివైన రాహుల్ గాంధీ నివాసంకు తను స్వయంగా వెళ్లి సమాలోచనలుచేశారు.

అంటే రాజకీయ అవసరమే కాకుండా తనకు చేదోడు లేనిదే ప్రధాని మోడీని ఎదుర్కోవడం కష్ట మనే భయంతో ఈ కథా కమామీశు నడిపించింది. అంతే కాదు. కాలికి బలపం కట్టు కొని వివిధ రాష్ట్రాలు తిరగాలసి వచ్చింది.ఇది జాతీయ స్థాయి ముఖ చిత్రం.

అంత వరకే పరిమితం కాలేదు.నేడు మరీ దిగజారి జనసేన నేత పవన్ తో జట్టు గురించి పరోక్షంగా వ్యాఖ్యానించడమే కొస మెరుపు. తనను తన కొడుకు లోకేష్ ను అతి నీచంగా అవినీతి పరులుగా చిత్రించడమే కాకుండా పార్టీ నేతలను ఒక మాఫియా గా రాష్ట్ర ప్రజల ముందు ముద్దాయిలుగా నిల బెట్టిన జన సేన నేత పవన్ కళ్యాణ్ తో సఖ్యత ఏర్పాట్లు చేసు కొనేందుకు తాజాగా ఫీలర్లు వదలడం అసలు సిసలు దిగ జారుడు తనం వ్యక్త మైంది.

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు లేక పోవచ్చు. కాని ఒక్కో నియోజకవర్గానికి పాతిక కోట్లు ఖర్చు చేసి గెలుపొందేందుకు సిద్ధంగా వున్నారని టిడిపి పాలన అవినీతి మయ మైనదనిఆరోపించడమే కాకుండా నోరు తెరిచితే మంత్రి లోకేష్ పై రాష్ట్రంలో ఏ ప్రతి పక్ష నేత విరుచుకు పడని విధంగా దాడి చేసిన నేతను ఉద్దేశించి పత్రికల వారు ఎంత రెచ్చగొట్టినా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలా మాట్లాడారంటే 2019 ఎన్నికల్లో ఓటమి చెందితే భవిష్యత్తు శూన్యమనే భయమే కారణంగా వుంది.మోడి ఒక పెనుభూతం గా చంద్రబాబు కు నిద్ర లో కూడా కనిపించు తున్నారు. ఓటు బ్యాంకు లేని మోడిని చూసి ఇంతలా జడుసు కుంటే మరి రాష్ట్రంలో ప్రతి పక్షాల గురించి చెప్ప పనిలేదు.

ముఖ్యమంత్రి చంద్రబాబే కాదు. ఎవరైనాసరే శత్రువులు ఎంత తగ్గించు కొంటే అంత మంచిది. కాని దురదృష్టం ఏమంటే నేడు చంద్రబాబు కు నలు మూలల ఎపుడూ లేనంతగా శత్రువులు వున్నారు. ఒక వేపు కెసిఆర్ మరో వేపు మోడీ వీరిద్దరు ఆలా వుండగా రాష్ట్రంలో కూడా జగన్ ఒక వేపు మరో వేపు పవన్ వీరికి తోడు వామపక్షాలు అందరూ సవాళ్లు విసిరే వారే. మిగిలింది-ఒక్కరే.

చిక్కి శల్యామై వున్న కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కారు చీకటిలో కాంతి రేఖగా వుంది. అదొక గుడ్డి కన్ను. తెరిచినా ఒకటే. మూసినా ఒకటే.బహుశా ఈ భయంతో కొత్త మిత్రుల కోసం వల విసురు తున్నారు.

వైసిపి నేతజగన్ తో పోరు దీని వలన జరిగే నష్టం కొత్త దేమీకాదు. నివారించ లేనిది. ఎప్పుడూవుండేదే. కాని పవన్ కళ్యాణ్ మూడవ పక్షంగా పోటీ చేస్తే ప్రధానంగా రెండు జిల్లాల్లో భారీగా టిడిపి ఓట్లకు గండి పడే అవకాశం వుంది.ఈ రెండు జిల్లాల్లో మెజారిటీ స్థానాలు తెచ్చు కోలేని ఏ పార్టీ కూడా రాష్ట్రంలో అధికారంలో నికి రావడం కుదరదు. ఈ భయం పట్టుకున్నందు వలనే అయాచితంగా పవన్ కళ్యాణ్ కు స్నేహంఅందించే విధంగా పరోక్షంగా ముఖ్యమంత్రి స్పందించారని భావించాలి. ఒకవేళ ఇదే నిజమైతే రాష్ట్రంలో టిడిపి పతనం దీనితోనే మొదలౌతుంది. వైసిపి నేతజగన్ దారి రహదారి అవుతుంది. ఎందుకంటే నిన్నటి వరకు తిట్టుకున్న నేతలు తిరిగి జట్టు కడితే శ్రేణులు ఓటర్లు అంతలోనే మారి పోతారను కోవడం భ్రమ మాత్రమే. తెలంగాణ అనుభవం కళ్ల ముందు వుంది.

పైగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రకారం ప్రధాని మోడీ కి వ్యతిరేకంగా పోరాటం చేసే సాకు చూపి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించు తారనే ప్రచారం వుంది. మొన్నటి వరకు మోడికి రెండవ మిత్రుడుగా వుండిన పవన్ ఈ రోజు ఆప్త మిత్రుడు గా పరిగణించ బెడితే మోడి భయం చంద్రబాబు కు ఎంతగా పట్టు కుందో తెలుస్తోంది.

నాణేనికి ఇది ఒక వేపు అయితే మరో వేపు పవన్ కల్యాణ్ చంద్రబాబు ఉచ్చులో పడితే ఆ క్షణం నుండే ఆయన పతనం మొదలౌతుంది. నిన్న మొన్నటి వరకు అవినీతి కంపుతో వున్నదని ఆరోపించిన పార్టీలో ఈ రోజు సువాసనలు గుబాళించు తున్నాయని పవన్ ఓటర్లను ఏలా నమ్మించ గలరు? 2014 ఎన్నికల్లో పడిన మరకలు పోగొట్టు కోలేక సతమత మౌతుండగా తిరిగి స్నేహం చేస్తారని ఊహించలేము.

గత నాలుగు ఏళ్లుగా చంద్రబాబు మాటలు మార్చి నట్లు దేశ చరిత్రలో ఏ నేత వ్యవహరించి వుండరు. అది ఆయనకే చెల్లు. కాని పవన్ కూడా అదే దారిలో పడతాడని ఏ మాత్రం ఊహించ లేము. అదే జరిగితే ఆయన పతనం ఆదిలోనే అంత మైనటే. ఒక వేళ జన సేన వర్గాలు నెగిటివ్ గా స్పందించితే చంద్రబాబు కు వున్న పరువు కాస్తా పోతుంది. ఎందుకో గాని ఇటీవల చంద్రబాబు తప్పు మీద తప్పులకు తల పడుతున్నారు.