అసెంబ్లీకి దారేది మిస్టర్ పవన్ కళ్యాణ్.?

‘నాతో పాటు పోటీ చేసే జనసేన అభ్యర్థులందరూ అసెంబ్లీకి వెళ్ళేలా పదునైన వ్యూహాలు రచిస్తున్నాం..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. జనసేన పార్టీ తరఫున ఒకే ఒక్కరు అసెంబ్లీకి వెళ్ళారు. ఆయనా ఆ తర్వాత వైసీపీలోకి దూకేేశారు.

2024 ఎన్నికల విషయానికొస్తే, జనసేన పార్టీకి ఓటు బ్యాంకు పెరిగిన మాట వాస్తవం. కానీ, సింగిల్ డిజిట్ సీట్లను జనసేన దాటుతుందా.? అన్నది అనుమానమే. పైగా, జనసేన అధినేత గెలిచే అవకాశమెంత.? అన్నదానిపై జనసైనికుల్లోనే బోల్డన్ని అనుమానాలున్నాయి. జనసేనాని గెలవాలంటే, టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సిందే. టీడీపీతో పొత్తు పెట్టుకుంటేనే జనసేన పార్టీ ఓ డజను అసెంబ్లీ సీట్లను అయినా గెలుచుకునే అవకాశముంది. అయితే, ఆ అవకాశం జనసేనకు ఎందుకు ఇవ్వాలి.? అని టీడీపీ భావిస్తోంది. టీడీపీకి బలం తక్కువగా వున్న ఓ ఇరవై సీట్లను జనసేనకు ఆఫర్ చేసే యోచనలో చంద్రబాబు వున్నారు.

అదే జరిగితే, జనసేన ఇంకోసారి గుండు సున్నా తప్పకపోవచ్చు. కానీ, పవన్ అయితే అసెంబ్లీకి వెళ్ళేందుకు ఆస్కారం వుంది. ఒకవేళ టీడీపీతో పెత్తు లేకపోతే మాత్రం.. జనసేన గుండు సున్నాయే.! ఇందులో ఇంకో మాటకు తావు లేదు.

కానీ, జనసేన అధినేత మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే వున్నారు.