చంద్రబాబుతో కలిస్తే పవన్ కు షాక్ తప్పదా ?

చూడబోతే అలాగే ఉంది పరిస్దితి క్షేత్రస్ధాయిలో. చంద్రబాబునాయుడు తాజా ప్రకటన తర్వాత పవన్, చంద్రబాబులు కలిస్తే జరగబోయేదేమిటి అనే అంశంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. కాపు నేతలు చెప్పేదాని ప్రకారం వచ్చే ఎన్నికల్లో పవన్, చంద్రబాబు మధ్య పొత్తుండే అవకాశాలు లేవు. ఒకవేళ చంద్రబాబుతో పవన్ కల్యాణ్ గనుక పొత్తు పెట్టుకుంటే అక్కడితో పవన్ రాజకీయ భవిష్యత్తుకు దారులు మూసుకుపోయినట్లే అని అన్నారు. చంద్రబాబు, పవన్ పొత్తులను కాపులే వ్యతిరేకిస్తారంటూ చెబుతున్నారు. ఒంటరిగా పోటీ చేస్తేనే పవన్ కు ఎంతో కొంత క్రేజుంటుందని చంద్రబాబుతో కలిస్తే ఇఫుడున్న క్రేజ్ కూడా మైనస్ లోకి పడిపోతుందట.

 

మొదటి నుండి పవన్ వైఖరి అనేక అనుమానాలకు దారితీస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. కొద్దిరోజులు చంద్రబాబు, నారా లోకేష్ లను తిడతాడు. ఇంకొన్ని రోజులు జగన్ ను విమర్శిస్తాడు. మరికొద్ది రోజులు టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడుని అలాగే చింతమనేని ప్రభాకర్ పై మండిపడుతుంటారు. అంటే ఎవరిని ఎందుకు తిడతారో కూడా పవన్ కు తెలీదనే అనుకోవాలి. చాలామంది మంత్రులు, ఎంఎల్ఏలు అక్రమ సంపాదనలో ముణిగిపోయారని ఒకవైపు తిడుతు అదే పార్టీతో మళ్ళీ పొత్తులు పెట్టుకుంటే జనాలు ఎలా రియాక్ట్ అవుతారో ఊహించలేనంత అమాయకుడు కాదు పవన్. జగన్ తో పొత్తులు పెట్టుకోకపోయినా పర్వాలేదు కానీ చంద్రబాబుతో కలిస్తే మాత్రం అంతే సంగతులు.

 

ఇవన్నీ కూడా చంద్రబాబు కూడా ఆలోచించారట. అందుకనే పవన్ ను గబ్బు పట్టించటమే ఏకైక లక్ష్యంగా చంద్రబాబు పెట్టుకున్నట్లు కాపు నేతలు చెబుతున్నారు. చంద్రబాబు లక్ష్యమేమిటంటే పవన్ తనతో పొత్తు పెట్టుకోకపోయినా పర్వాలేదు కానీ జగన్ వైపు మాత్రం పోనీకుండా చూడటమే అని కాపు నేతలు అనుమానిస్తున్నారు. పాదయాత్రతో జగన్ పై పెరిగిన క్రేజుకు తోడు రేపటి ఎన్నికల్లో పవన్ కూడా జగన్ తో కలిస్తే తనకు ఇబ్బందులు తప్పవని చంద్రబాబుకు బాగా తెలుసని కాపు నేతలంటున్నారు. అందుకే ముందు జాగ్రత్తగా పవన్ ను గబ్బు పట్టిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. మరి పవన్ మనసులో ఏముందో తెలియాలంటే కొంత కాలం ఆగక తప్పదు.