ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఇప్పటికే కేరళ, పుదుచ్చేరి, అస్సాంలలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ మూడు ప్రాంతాల్లోనూ ప్రజలు పోటా పోటీగా పోలింగ్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 23 నుండి 29 వరకు పశ్చిమ బెంగాల్ లో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో… 294 మంది ఎమ్మెల్యేల్లో ఏ పార్టీకి ఎంతమంది సభ్యులు గెలుస్తారనేది తెలియాలంటే మే 4న విడుదలయ్యే ఫలితాల వరకూ ఎదురు చూడాలి.
ఈ సమయంలో… మమతకు అటు బీజేపీ, ఇటు ఎంఐఎం లు గుడ్ న్యూస్ చెప్పాయనే విశ్లేషణలు తాజాగా తెరపైకి వచ్చాయి. అలా అని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏమీ ఆటలో అరటి పండు కాదు సుమా..! కాకపోతే… పశ్చిమ బెంగాల్ లో గత మూడు దఫాలుగా మరొకరికి అవకాశం ఇవ్వకుండా దాదాపుగా వార్ వన్ సైడ్ అన్నట్లుగా మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ విజయం సాధిస్తుండగా.. ఈ సారి ప్రతిపక్షాలన్నీ ఎవరికి వారే అయిపోవడంతో టీఎంసీ నడక మరింత సులువయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
అవును… 20 మే 2011న పశ్చిమ బెంగాల్ మొదటి మహిళా ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేశారు. నాటి నుంచి నేటి వరకూ వెస్ట్ బెంగాల్ ప్రజల్లో దీదీపై నమ్మకం, గౌరవం అలానే కొనసాగుతున్నాయని అంటున్నారు.
అయితే… ఇన్నిసార్లు వరుసగా ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత కచ్చితంగా ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. దీంతో దాన్ని పూర్తిగా క్యాష్ చేసుకోవాలని ప్రతిపక్ష భారతీయ జనతాపార్టీ తీవ్ర ప్రయత్నాలే మొదలుపెట్టింది.
ఈ క్రమంలో ఎన్నికల హామీల్లో వరాల జల్లులు కురిపించే పనికి పూనుకుంది. ఇందులో భాగంగా… నిరుద్యోగ యువతకు నెలకు రూ.3వేలు, మహిళలకు ప్రతినెలా రూ.3వేలు ఆర్థిక సాయం అని ప్రకటించేశారు బీజేపీ నేతలు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్న రీతిలో అటు ప్రధాని మోడీ, ఇటు అమిత్ షా తో పాటు కాషాయ పార్టీలోని కీలక నేతలంతా పశ్చిమ బెంగాల్ లో ప్రచారాలతో హోరెత్తించేస్తున్నారు.
ఇక ఆ రాష్ట్రంలో ముస్లిం ఓటర్లు సుమారు 30% ఉన్న నేపథ్యంలో… ఆ రాష్ట్ర శాసనసభలో మొత్తం 294 అసెంబ్లీ సీట్లు ఉంటే.. వీటిలో దాదాపు 121 అసెంబ్లీ స్థానాల్లో ముస్లింల ప్రాబల్య ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న తరుణంలో.. అక్కడ ఎంఐఎం ప్రభావం కూడా కీలకంగా ఉండనుంది.
ఈ క్రమంలో గత మూడు సందర్భాల్లోనూ పరోక్షంగా మమతకు మద్దతుగా నిలిచిన ఎంఐఎం… ఆ రాష్ట్రంలోని ‘జనత ఉన్నయన్’ పార్టీతో పొత్తు కుదుర్చుకొని.. ఈ దఫా బరిలోకి దిగాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ గత నెలలో ప్రకటించారు. దీంతో ఈసారి ఎన్నికల్లో మమత గెలుపు నల్లేరుపై నడక కాదనే చర్చ బలంగా వినిపించింది.
కట్ చేస్తే… తనను గద్దె దించేందుకు బీజేపీ రూ.1,000 కోట్ల ఒప్పందం కుదుర్చుకుందని.. మైనారిటీ ఓట్లను చీల్చి తమను ఓడించడానికి బీజేపీ నేత సువేందు అధికారితో కలిసి ‘జనతా ఉన్నయన్’ పార్టీ చీఫ్ హుమాయూన్ కుట్ర పన్నారని ఆరోపిస్తూ.. దీనిపై వైరల్ అయిన వీడియోను ప్రస్తావిస్తూ.. ఈ ఒప్పందంలో భాగంగా హుమాయూన్ ఇప్పటికే రూ.200 కోట్లను అడ్వాన్స్ గా తీసుకున్నట్లు ఆ వీడియోలో ఉందని మమత పేర్కొన్నారు.
ఆ వీడియో కాస్త వైరల్ గా మారడంతో పశ్చిమ బెంగాల్ లో రాజకీయం మరింత చర్చనీయాంశంగా మారింది. దీంతో… మమతకు ముస్లిం మైనరిటీ ఓటర్లు భారీగా దూరమయ్యే అవకాశం లేదనే చర్చ మొదలైంది.
దీనికితోడు.. తాజాగా బీజేపీతో హుమాయూన్ కు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో జనతా ఉన్నయన్ పార్టీతో ఉన్న పొత్తును రద్దు చేసుకున్నట్లు ఎంఐఎం వెల్లడించింది. దీంతో.. బెంగాల్ ఎన్నికలకు ముందు ఇది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ పరిణామాల నేపథ్యంలో… అటు బీజేపీ సంగతి కాసేపు పక్కనపెడితే… జనతా ఉన్నయన్, ఎంఐఎం లు ముస్లిం ఓట్లను చీల్చుకునే అవకాశం ఉందని అంటున్నారు. అయితే వీరిని ముస్లిం ఓటర్లు ఎంత మేరకు నమ్ముతారనేది ఇక్కడ కీలకం.
ఎందుకంటే… హుమాయూన్ కు బీజేపీతో సంబంధాలు ఉన్నాయనే వీడియో వైరల్ అవ్వడంతో పాటు.. గత బీహార్ అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి ఎంఐఎం పంథా మారిపోయిందని.. బీజేపీకి ఈ పార్టీ లోపాయికారీగా మద్దతు ఇస్తుందని టీఎంసీ బలంగా ప్రచారం చేస్తుందని తెలుస్తోందని అంటున్నారు.
దీంతో.. ఈ రెండు పార్టీల కంటే ఇంతకాలం తాము మద్దతుగా ఉన్న మమత వైపు మెజారిటీ ముస్లింలు మొగ్గు చూపే అవకాశాలకూ కొదవ లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక మిగిలిన హిందూ ఓట్లు గంపగుత్తగా బీజేపీకి పడిపోతాయని ఎవరూ భావించని పరిస్థితి!
మరోవైపు ‘సెంట్రల్ బెంగాల్’ ప్రాంతంలో అధికార తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు మునుపెన్నడూ లేని విధంగా వేడెక్కిందని అంటున్నారు. వాస్తవానికి ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటలుగా ఉన్న మాల్దా, ముర్షీదాబాద్ జిల్లాలో పట్టును నిలబెట్టుకునేందుకు మమతా బెనర్జీ ప్రయత్నిస్తుండగా.. పూర్వ వైభవం తెచ్చుకోవాలని కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇక్కడ కూడా ముస్లిం ఓట్లు కీలక భూమిక పోషించనున్నాయి.
దీంతో… విపక్షాలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా మారిపోయిన నేపథ్యంలో.. పైగా, వారి తెరవెనుక మంతనాలకు సంబంధించిన వీడియోలు వెలుగులోకి వచ్చేస్తున్న తరుణంలో.. దీనికి తోడు ఎన్నికలకు కొన్ని వారాల ముందే కలిసిన సంబంధాలు, రోజుల వ్యవధిలోనే విడిపోతోన్న పరిస్థితుల్లో… ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు.
ఫలితంగా… నాలుగోసారి పశ్చిమ బెంగాల్ ఓటర్లు మమతకు పట్టం కట్టే అవకాశాన్ని కొట్టిపారేయలేమని చెబుతున్నారు.
మరి పోలింగ్ తేదీ వరకూ పరిస్థితి ఇలానే ఉంటుందా.. లేక, ఈలోపు బీజేపీ సరికొత్త వ్యూహాలు చేస్తుందా.. ఎంఐఎం నిర్ణయంలో ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటాయా అనేది వేచి చూడాలి.
ఈ సమీకరణాలు, ప్రచారాలు, ఆరోపణలు, వ్యూహాలు, ప్రతి వ్యూహాల నేపథ్యంలో.. ఈసారి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో రాబోయే ఫలితాలు కచ్చితంగా నభూతో నభవిష్యతీ అనే చెప్పాలి!
