అమరావతి బాండ్లపై ఉండవల్లి ఫైర్

అమరావతి బాండ్లపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఫైర్ అయ్యారు. అమరావతి అభివృద్దికి అధిక వడ్డీకి అప్పులు తీసుకోవాల్సిన దౌర్బాగ్యమెందుకని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాండ్ల ద్వారా తీసుకున్న రూ.2 వేల కోట్ల అప్పుకు ప్రతి మూడు నెలలకు 10.36శాతం అధిక వడ్డీ చెల్లించాలన్నారు. అమరావతి బాండ్లలో బ్రోకర్ కు రూ. 17 కోట్లు ఇవ్వడమే చంద్రబాబు చెబుతున్న పారదర్శకతా అని చంద్రబాబును ప్రశ్నించారు. బాండ్లు కొన్న 9 మంది పేర్లు ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

అధిక వడ్డీకి అప్పులు తీసుకోవద్దంటూ 7 నెలల క్రితమే జీవో జారీ చేశారని గుర్తు చేశారు. నాలుగేళ్లలో తీసుకున్న రూ.1.30 లక్షల కోట్ల అప్పును ప్రభుత్వం చేసిందని, దీనంతటిని ఏం చేశారని నిలదీశారు. అప్పట్లో విజన్ 2020 రూపొందించిన చంద్రబాబు సలహాదారు పాస్కల్ ప్రస్తుతం స్విట్జర్లాండ్ జైలులో ఉన్నారన్నారు. ఏ రాష్ట్రంలో లేని పన్నులు ఏపీ లో వేస్తున్నారన్నారు. మద్యం, పెట్రోల్ పై ప్రభుత్వం అధికంగా పన్నులు వేస్తుందన్నారు. 50 రూపాయల మద్యం క్వార్టర్ పై 37 రూపాయలు ప్రభుత్వమే దండుకుంటుందన్నారు.