వైసీపీకి వంగవీటి కుటుంబం షాక్ 

 
 
కృష్ణా జిల్లా వైసీపీ రాజకీయాల్లో అంతర్గతపోరు తారాస్థాయికి చేరుకుంది. జగన్ నిర్ణయంతో వంగవీటి రాధాకు అవమానం జరిగిందంటూ అతని సోదరుడు వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్ వైసీపీకి రాజీనామా చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్నారు వంగవీటి రాధా. కానీ ఆయనకు నిరాశ మిగిల్చారు పార్టీ అధినాయకుడు జగన్. ఆ సీటును మల్లాది విష్ణుకి కేటాయించి రాధాకు మచిలీపట్టణం నియోజక వర్గం బాధ్యతలు అప్పగించారు. జగన్ నిర్ణయంతో తీవ్ర అసంతృప్తి చెందారు రాధా. 
 
అంతేకాదు రాధా వర్గీయులంతా ఈ విషయంపై ఆగ్రహిస్తున్నారు. ఈ తరుణంలో రాధాకు సెంట్రల్ టికెట్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఆయన సోదరుడు ఉయ్యురు కౌన్సిల్, జిల్లా ఫ్లోర్ లీడర్ వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్ వైసీపీకి రాజీనామా చేశారు. అయితే రాధా ఎప్పటి నుండో టీడీపీకి వెళ్లనున్నట్టు వార్తలు వచ్చాయి. టీడీపీ కూడా ఆయన కోరుకుంటున్న సీటు ఇస్తామని ఆహ్వానించిన్నటు సమాచారం. కానీ తన తండ్రి ప్రత్యర్ధులు ఆ పార్టీలోనే ఉండటంతో ఆయన సుముఖత చూపట్లేదని రాజకీయవర్గాల్లో టాక్. 
 
 
ప్రస్తుతం వైసీపీ మీద తీవ్ర స్థాయిలో అసంతృప్తిగా ఉన్న రాధా టీడీపీ వైపు అడుగులు వేస్తారేమో అనేది అందరి ఆలోచన. అయితే వంగవీటి రాధా తన కుటుంబసభ్యులు, అనుచరులతో సమావేశం అవ్వాలి అనుకుంటున్నారట. అందరితో డిస్కస్ చేసి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.