పురందేశ్వరిపై సెటైర్ వేసిన సాయిరెడ్డి… తెరపైకి కొత్త చర్చ!

ఒకపక్క కేంద్రంలో బీజేపీకి అవసరమైన ప్రతిసారీ వైసీపీ నుంచి అందాల్సిన సాయం, దక్కాల్సిన మద్దతు దక్కుతూనే ఉన్నాయి. ఈ సందర్బంగా ఇప్పటికే జగన్ పలుమార్లు ఈ విషయంపై వివరణ ఇచ్చారు. తనకు వ్యక్తిగత ఈగోలు, వ్యక్తిగత లక్షయాలూ లేవని… ఫైనల్ గా రాష్ట్ర బాగోగులు ముఖ్యమని చెప్పారు. కేంద్రం కూడా జగన్ కు అధికారికంగా రావాల్సిన ఆర్ధిక సాయం అందిస్తూనే ఉంది.

అది బీజేపీ – వైఇసీపీల మధ్య అండర్ స్టాండింగ్ కాదు… కేవలం రాష్ట్ర ప్రభుత్వం – కేంద్ర ప్రభుత్వాల మధ్య ఉండే అవగాహన మాత్రమే అనేది వైసీపీ నేతలతో పాటు, బీజేపీ నేతలూ చెప్పేమాట. ఆ సంగతి అలా ఉంటే… కొత్తగా ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి పొందిన పురందేశ్వరి గతకొన్ని రోజులుగా వైసీపీ సర్కార్ పై విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా… ఏపీలో అప్పులపై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అనధికారిక అప్పులు పెరిగిపోయాయంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ని కలిశారు. వినతిపత్రం ఇచ్చారు. ఇదే సమయంలో ఏపీకి సహకరించొద్దని రాష్ట్రంపై తన ప్రేమను వ్యక్తపరిచే ప్రయత్నం కూడా చేశారని అంటుంన్నారు! దీంతో వైసీపీ నుంచి సెటైర్స్ మొదలైపోయాయి.

ఇందులో భాగంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా స్పందించారు. పురందేశ్వరి ఫ్లెక్సీలను షేర్ చేస్తూ… సెటైర్స్ వేశారు. ఏపీలో బీజేపీకి సీనేమీ లేదన్నట్లుగా వ్యాఖ్యానిస్తూ… భారీ ఫ్లెక్సీలతో లేని హడావిడి చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఒక కీలక వ్యాఖ్య చేశారు సాయిరెడ్డి. ఇప్పుడు అదే హాట్ టాపిక్ గా మారింది.

“కొత్త అధ్యక్షురాలు ఫ్లెక్సీలతో లేని హడావుడి చేసే బదులు… వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలనో, రైల్వే జోన్, ఇండస్ట్రియల్ కారిడార్ త్వరగా ఏర్పాటు చేయాలనో పోరాడొచ్చుగా! ప్రజలకు కాస్తయినా ప్రయోజనం ఉంటుంది. ఒక పార్టీలో ఉంటూ వేరే పార్టీకి పనిచేయడం ఎందుకు?” అని ట్వీట్ చేస్తూ.. పురందేశ్వరికి సంబంధించిన భారీ ఫ్లెక్సీ ఫోటొను పోస్ట్ చేశారు సాయిరెడ్డి.

ఇదంతా ఒకెత్తు అయితే… చివరిలో అన్న మాట… “ఒక పార్టీలో ఉంటూ వేరే పార్టీకి పనిచేయడం ఎందుకు?” అంటూ వేసిన డైలాగ్ ఇప్పుడు హాట్ టతపిక్ గా మారింది. దీంతో పురందేశ్వరి బీజేపీలో ఉంటూ… టీడీపీ ప్రయోజనలాకోసం పనిచేస్తుందనే అర్ధం వచ్చేట్ట్లు సాయిరెడ్డి కామెంట్ చేశారని అంటున్నారు పరిశీలకులు. మరి ఈ విషయంపై పురందేశ్వరి ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.