విజయసాయిరెడ్డి వెటకారం అలా ఉంది… మార్టిన్ కూపర్ ఏమవ్వాలి?

పలు సందర్భాల్లో చంద్రబాబు చెప్పే మాటలు చాలా మందికి నవ్వు తెప్పిస్తుంటాయని అంటుంటారు. ఐటీనే తానే తెచ్చినట్లు, అసలు ఇన్ ఫర్ మేషన్ టెక్నాలజీకి తానే ఆధ్యుడిని అయినట్లు, సెల్ ఫోన్ తానే తెచ్చినట్లు, చంద్రయాన్-3 సక్సెస్ లో కూడా తనకు వాటా ఉందన్నట్లుగా వినిపించే మాటలు రాజకీయ కామెడీలో పరాకాష్టగా చెబుతుంటారు. తాజాగా ఈ విషయాలు రాజ్యసభలో ప్రస్థావనకు వచ్చాయి!

పార్లమెంట్ ప్రత్యేక సెషన్లో టీడీపీ అధినేత చంద్రబాబు గురించి మరోసారి ప్రస్థావన వచ్చింది. ఇందులో భాగంగా నూతన పార్లమెంట్ భవనంలో మొదలైన చర్చలో భాగంగా చంద్రబాబు అవినీతి, వెన్నుపోట్ల వ్యవహారాన్ని సభముందుకు తీసుకొచ్చారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలతో సభలో నవ్వులు పూయించారు.

ఇందులో భాగంగా… సెల్ ఫోన్ సృష్టికర్త తానేనని చంద్రబాబు చెప్పుకుంటారని అన్నారు. చంద్రయాన్‌ విజయంపై జరిగిన చర్చ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో మాట్లాడారు. భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. 2014నుంచి, బీజేపీ హయాంలో భారత్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగం పురోగమించిందని చెప్పుకొచ్చారు.

ఆ సంగతులు అలా ఉంటే… ఈ రెండు పార్టీల మధ్యలో చంద్రబాబు తన గొప్పలు చెప్పుకుంటారని మొదలుపెట్టిన విజయసాయిరెడ్డి… స్పేస్ రీసెర్చ్ కి పితామహుడిని అని, కంప్యూటర్, సెల్ ఫోన్ కనిపెట్టింది తానేనని చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా వాటన్నింటిపైనా నిజ నిర్థారణ చేయాలని సభను కోరడం గమనార్హం.

ఇదే సమయంలో సెల్ ఫోన్ కనిపెట్టింది తానే అని చంద్రబాబు చెప్పుకుంటారు కాబట్టి… చంద్రబాబు కనిపెట్టిన వస్తువులకు పేటెంట్‌ తీసుకుంటే భారత్‌ కు కోట్ల రూపాయల్లో ఆదాయం గ్యారంటీగా వస్తుంది అంటూ వ్యంగ్యస్త్రాలు విసరడం కొసమెరుపు. దీంతో సభలో నవ్వులు మొదలయ్యాయి.

కాగా… మార్టిన్ కూపర్ ని ఫాదర్ ఆఫ్ ది సెల్యులర్ ఫోన్ అంటారు. 1972 – 73 సమయంలో ఆయన మొదటి సెల్యులర్ ఫోన్ ని బిల్ట్ చేశారు.