తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందేల జోరు కొనసాగుతోంది. టిఆర్ఎస్ నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, మాధవరం కృష్ణారావులు పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలో సందడి చేయనున్నారు. సనత్ నగర్ లో స్థిరపడ్డ ఏపీ మిత్రులు ఆహ్వానం మేరకు ఆయన అక్కడికి వెళుతున్నారు.

రోడ్డు మార్గంలో వెళ్తున్న తలసాని తొలుత విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం అక్కడి నుంచి భీమవరం చేరుకొని మావూళ్లమ్మ అమ్మవారిని దర్శించుకుంటారు. రాత్రికి భీమవరంలోనే బస చేసి, రేపు సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా తలసానికి స్వాగతం పలుకుతూ అక్కడ ఫ్లెక్సీలు వెలిశాయి.
ఇబ్రహీంపట్నంలోని ఓ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో తలసాని పాల్గొన్నారు. అయన ఏమన్నారంటే
“తెలంగాణలో యాదవులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. చట్టసభల్లో తగినన్ని సీట్లిచ్చి కేసీఆర్ యాదవులను గౌరవించారు. ఏపీలోనూ యాదవ నేతలు రాజకీయాల్లో ఎదగాలి. ఇళ్లల్లో కూర్చొంటే రాజకీయ అవకాశాలు రావు. యాదవులు సంఖ్యా బలం చూపాలి.. సంఘటితం కావాలి. ఏపీలో యాదవుల రాజకీయ ఎదుగుదలకు నేను అండగా ఉంటా. ఏపీలో బీసీలకు నాయకుడు లేరు. బీసీలకు పప్పు బెల్లాలు పెట్టి పంపేస్తున్నారు. చట్ట సభల్లో అవకాశం ఇవ్వకుంటే ఎవరినైనా ఓడించాలి. ఏపీలో బీసీలకు ఆదరణ లేదు. ఏపీ ప్రభుత్వం బీసీలకు అండగా ఉన్నామంటూ ప్రచారం చేసుకుంటోంది. ఏపీలోని యాదవులకే కాదు.. బీసీలకూ నాయకత్వం వహించడానికి సిద్దంగా ఉన్నా.” అని తలసాని అన్నారు.
.
