40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలా ఎప్పుడూ జరగలేదు .. వారిపై కేసు వేస్తా : వైసీపీ ఎమ్మెల్యే

నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేగా తాను అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోందని, అధికారులతో తాడో పేడో తేల్చుకుంటానని ,ప్రజాప్రతినిధులకు జరిగిన అవమానం రాజ్యాంగ విరుద్ధంగా భావిస్తూ, అధికారులపై కేసులు కూడా వేస్తాను అని అన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలా ఎప్పుడూ జరగలేదన్నారు.

నెల్లూరులో మంగళవారం నిర్వహించిన గణతంత్ర వేడుకలకు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలను ఆహ్వానించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆనం.. రాష్ట్ర ప్రివిలేజెస్‌ కమిటీకి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. గణతంత్ర వేడుకలకు ఎమ్మెల్యేలకే కాదు, మంత్రులకు సైతం ఆహ్వానం లేకపోవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించింది అన్నారు.

ఈ విషయంపై కలెక్టర్‌ కార్యాలయంలోని జిల్లా ప్రొటోకాల్‌ అధికారులను అడిగితే.. తాము చిన్నవాళ్లం.. సమాధానం చెప్పలేమనడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లాల్లోని అధికారుల తీరుతో వారిలో అహంకారం కనిపిస్తోందని.. లాయర్లతో మాట్లాడి అధికారులపై కేసులు వేస్తామన్నారు. అయన గతంలో కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేశారు.