బీజేపీకి డిపాజిట్ దక్కితే గొప్పట.. అందుకే ఈ ఫీట్లట ?

There is no chance to BJP in Tirupathi
ఆంధ్రాలో అధికార పార్టీ తర్వాత అంత హడావుడి చేస్తున్న పొలిటికల్ పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీనే.  ఇన్నేళ్ళు ఏదో ఉన్నాం అంటే ఉన్నాం అన్నట్టుగా ఉన్న బీజేపీ ఇప్పుడు చాలా హుషారు అందుకుంది.  అందుకు ప్రధాన కారణం కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు.  ఢిల్లీ హైకమాండ్ నుండి ఎలాంటి ఆదేశాలు అందాయో తెలీదు కానీ రాష్ట్రంలో బీజేపీ ఎన్నడూ లేనంతగా కార్యకలాపాలను ముమ్మరం చేస్తోంది.  2024 నాటికి అందితే అధికారం లేదా కనీసం ప్రధాన ప్రతిపక్షంగా అయినా ఉండాలనేది బీజేపీ అంటున్న మాట.  ఆ రెండు స్థానాలు తప్ప అంతకంటే కిందకి దిగడం లేదు.  బీజేపీ దూకుడుతో ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు ఆస్కారం కనబడుతోంది. 
 
There is no chance to BJP in Tirupathi
There is no chance to BJP in Tirupathi
ప్రధానంగా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల బరిలో సత్తా చాటాలని భావిస్తున్నారు.  తిరుపతిలో ఒకప్పుడు తమ అభ్యర్థి గెలిచారని, కాబట్టి తమకు ఓటు బ్యాంక్ ఉందని బీజేపీ అంటోంది.  కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కేవలం 16 వేల ఓట్లు మాత్రమే సాధించగా జనసేన మద్దతిచ్చిన బిఎస్పీ క్యాండిడేట్ 21 వేల ఓట్లకే పరిమితమయ్యారు.  ఇప్పుడు ఈ రెండు పార్టీలో కలిసి అభ్యర్థిని నిలబెట్టనున్నాయి. ఈ రెండు పార్టీలకు విడివిడిగా వచ్చిన ఓట్ల కంటే నోటీకు పడిన ఓట్లే ఎక్కువ.  అలాంటిది తిరుపతిని గెలిచేస్తామని బీజేపీ అంటుండటం మేకపోతు గాంభీర్యం తప్ప మరొకటి కాదు. 
 
ఎన్నికల్లోకి దిగే ముందు సొంత సర్వేలు కామన్.  బీజేపీ కూడ తిరుపతిలో సర్వే చేయించుకుందట.  భయపడ్డట్టే గ్రౌండ్ లెవల్లో పార్టీ వీక్ అని తేలిందట.  గెలవడం కాదు కదా ఎంత భీకరంగా పోరాడినా, అవతల పార్టీలు ఎంత బలహీనపడిన 40 నుండి 50 వేల లోపు ఓట్లకే పరిమితం కావాల్సి ఉంటుందని అంచనా వచ్చిందట.   తెలంగాణ బీజేపీ నాయకులను రంగంలోకి దింపారు.  ఒక్క బండి సంజయ్ మినహా మిగతా నాయకులంతా ఏపీ వివాదాల్లో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారు.  ఎమ్మెల్యే రాజాసింగ్ శ్రీశైలంలో అన్యమతస్థులు పెత్తనం పెరిగిందని ఆరోపణలు చేయగా రామతీర్థం వివాదంలో సైతం గట్టిగానే కలుగజేసుకంటూ జగన్ మీద, చంద్రబాబు మీద విమర్శలు గుప్పిస్తున్నారు.    
 
సీనియర్ నేత లక్ష్మణ్ అయితే కేంద్రం నుండి నిధులు రావాలంటే  తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ – జనసేన అభ్యర్థిని గెలిపించాలని అన్నారు.  ఇవన్నీ కాకుండా  పార్టీకి ఉన్న ట్రేడ్ మార్క్ ఫార్ములా అయిన రథయాత్రను తెరమీదకు తీసుకొచ్చారు.  రాష్ట్రంలో ఆలయాల మీద జరుగుతున్న దాడులకు నిరసనగా రామతీర్థం వరకు రథయాత్ర చేయాలని నిర్ణయించారు.  అది కూడ తిరుపతి నుండే చేయనున్నారు.  మరి సర్వే ఫలితాల్లో మార్పు కోసం బీజేపీ చేస్తున్న ఈ ఫీట్లు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.