చొప్పదండి టిఆర్ఎస్ లో కలకలం (వీడియోలు)

చొప్పదండి నియోజకవర్గ రాజకీయాలు తెలంగాణ అంతటా హాట్ టాపిక్ అయ్యాయి. చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభకు, టీఆరెస్ అధిష్టానం టికెట్ ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టింది.

సిట్టింగ్ లు అందరికి సీట్లు కేటాయించినా శోభా సీటును పెండింగ్ లో పెట్టడంతో… ఆమె సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక దశలో టీఆరెస్ పై తిరుగుబాటు చేసే దిశగా శోభా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో చొప్పదండి కేంద్రంగా మరో రాజకీయ వివాదం తెర మీదకు వచ్చింది. సంచలనం రేపిన ఈ సంఘటన పూర్తి వివరాలు చదవండి.

కరీంనగర్ జిల్లా చొప్పదండిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. టీఆర్ఎస్ ఎంపీపీ భూంరెడ్డి పై ఎంపీటీసీలు గత నెల 23న అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. అప్పటి నుంచి వారు క్యాంపు ఏర్పాటు చేసారు. హైదరాబాద్ లోని ఓప్రాంతంలో క్యాంపులో ఉంటున్నారు. అయితే అవిశ్వాసం నోటీసు ఇచ్చినప్పటి నుంచి ఎంపీటీసీలను తన వైపునకు తిప్పుకోవాలని భూంరెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అవిశ్వాస తీర్మానం ఇచ్చిన రోజే కరీంనగర్ లోని ఓ హోటల్ లో బస చేస్తున్న ఎంపీపీలను కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. అయితే అక్కడికి మీడియా ప్రతినిధులు రాగానే వెనక్కి వెళ్లిపోయారు.

అయితే అప్పటి నుంచి హైదరాబాద్ లోనే క్యాంపు నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్ క్యాంపుకు వచ్చిన భూంరెడ్డి మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎలిగేటి తిరుపతి, చొప్పదండి ఒకటవ ఎంపిటీసి మరియు వైస్ ఎంపిపి భర్త మునిగాల చందులను తీసుకెళ్లారు. ఈ పోలీసులతో పాటు, ఎంపిపి భూంరెడ్డి కరీంనగర్ గ్రంధాలయ ఛైర్మన్ ఏనుగు రవిందర్ రెడ్డి, మార్కెట్ ఛైర్మన్ భర్త చుక్కారెడ్డి వుండటంతో ఇది అధికార పార్టీ ఒత్తిడి మేరకే జరుగుతుందని అంటున్నారు. ఈ సమయంలో క్యాంప్ లో వున్న దళిత ఎంపిటిసి అయిన స్వప్న పై దాడి చేసి అనుచితంగా ప్రవర్తించి భయబ్రాంతులకు చేసినట్లు ఆమె ఆరోపించారు.

అవిశ్వాసం పెట్టినందుకే భూంరెడ్డి తమపై కక్ష కట్టారని పోలీసులతో కుమ్మక్కై తప్పుడు కేసులు పెట్టాలని చూసారని క్యాంపులోని మిగతా సభ్యులు ఆరోపిస్తున్నారు. తమను భయబ్రాంతులకు గురిచేసి ఇద్దరిని తీసుకుపోవడంతొ మిగిలిన తొమ్మిది మంది ఎంపిటీసి లు తమకు ఎంపిపి మరియు అతని అనుచరులతో ప్రాణహాని ఉందని హైదరాబాదు లొని మాదాపూర్ పోలీస్ స్టేషనుకు చేరుకొని అక్కడి సిఐని కలిసి విన్నవించుకున్నారు. తమకు రక్షణ కావాలని, కరీంనగర్ కమీషనర్ కమల్ హాసన్ రెడ్డి ఒత్తిడి మేరకే ఈ అన్యాయం జరుగుతుందని, వారిపై మాకు నమ్మకం లేదు కాబట్టి హైదరాబాదులో పోలీసులు మాకు రక్షణ కల్పించాలని ఎంపిటిసిలు కోరుతున్నారు.