టిడిపికి 150 సీట్లు..డ్వాక్రా మహిళలకు రూ. 10 వేలు..కొత్త కథ

రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని 150 అసెంబ్లీ నియోజవర్గాల్లో గెలిపిస్తే చాలంటున్నారు చంద్రబాబునాయుడు. మొన్నటి వరకు ఇదే చంద్రబాబు మొత్తం 175 అసెంబ్లీల్లోను తెలుగుదేశంపార్టీనే  గెలుస్తుందంటూ ఢంకా భజాయించి మరీ చెప్పేవారు. అలాంటిది తాజాగా మాత్రం 150 సీట్లే అంటున్నారు. బహుశా మిగిలిన 25 అసెంబ్లీ సీట్లను తమతో పొత్తులు పెట్టుకుంటుందని అనుకుంటున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖాతాలో వేశారే ఏమో ? అమరావతి పరిధిలోని నేలపాడులో జరిగిన పసుపు కుంకుమ అంటూ డ్వాక్రా సంఘాల మహిళల సమావేశం జరిగింది లేండి.

ఆ సమావేశంలో మాట్లాడుతూ ప్రతీ డ్వాక్రా మహిళ ఖాతాలో తలా రూ 10 వేలు వేస్తానంటూ భీష్మ ప్రతిజ్ఞ చేశారు. మూడు విడతల్లో చెక్కుల ద్వారా ప్రతీ మహిళ బ్యాంకు నుండి డబ్బు డ్రా చేసుకోవచ్చట. పోయిన ఎన్నికల్లో డ్వాక్రా  రుణాలమాఫీ హామీ మాటేంటని అడక్కూడదు చంద్రబాబును. మళ్ళీ చంద్రన్నకు కోపం వచ్చేస్తుంది. పోయిన ఎన్నికల్లో చెప్పిన రుణమాఫీనే ఇంత వరకూ సక్రమంగా జరగలేదు. చినబాబు ఎక్కడా టూరు చేసినా మహిళలు ఎక్కడికక్కడ నిలదీస్తున్న విషయం అందరూ చూసిందే. ఎన్నికల్లోపు డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీని అమలు  చేసేందుకు ప్రభుత్వం ఆర్ధిక సంస్ధల చుట్టూ తిరుగుతోంది. ఖజానాలో ఒక్క రూపాయి కూడా లేదు. అందుకనే అప్పులు ఇచ్చేవారి కోసం తిరుగుతోంది.

వాస్తవాలిలా ఉంటి మళ్ళీ డ్వాక్రా మహిళల ఖాతాలో పది వేల రూపాయలంటూ కొత్త కథలు వినిపిస్తున్నారు. 1.40 కోట్ల మంది మహిళలకు స్మార్ట్ ఫోన్లు కొనిస్తారట.  అక్క, చెల్లెళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు తనతో మాట్లాడటానికికట. ఎలాగుంది చంద్రన్న షుగర్ కోటింగ్ ? మరి వాటికయ్యే బిల్లులను ఎవరు చెల్లిస్తారో మాత్రం చెప్పలేదు. నాలుగున్నరేళ్ళల్లో డ్వాక్రా మహిళలకు రూ 21,116 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. మరి అదే నిజమైతే అసలు చెల్లించాల్సిందెంత ? చెల్లించిందెంత ? అన్న విషయాన్ని మాత్రం చెప్పరు. నిజంగానే డ్వాక్రా రుణాలన్నింటినీ చెల్లించేస్తే మహిళలు లోకేష్ బాబును ఎందుకు నిలదీస్తున్నట్లు ?

అక్క, చెల్లెళ్ళ మీద ప్రేమతోనే తాను ఈ వరాలు ఇస్తున్నట్లు పెద్ద బిల్డప్పే ఇచ్చారులేండి. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే మహిళలంతా టిడిపికే ఓట్లేయాలని కూడా చెప్పారు. ప్రపంచంలో తానే మానవత్వవాదినంటూ చెప్పుకున్నారు. మహిళలకు తాను చేసిన గొప్ప మేలును గుర్తుంచుకుని మరీ రాబోయే ఎన్నికల్లో టిడిపిని 150 సీట్లలో గెలిపించాలని చెప్పారు. తనను మహిళలు బలోపేతం చేస్తే పరిపాలన నిరాఘాటంగా సాగిస్తానంటూ చెప్పుకున్నారు.  మరి చంద్రన్న మాటలను డ్వాక్రా మహిళలు ఎంత వరకూ విశ్వసిస్తారో చూడాల్సిందే.