పవన్ కళ్యాణ్‌కి పేరు రావటమా.? చంద్రబాబు గుస్సా.!

అప్పుడెప్పుడో కేంద్ర మంత్రి అమిత్ షా‌ని కలిశారు సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆ సమయంలో ‘విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో పునరాలోచించాలి..’ అంటూ ఓ విజ్ఞాపన లేఖ కూడా అందించారు కేంద్ర హోంమంత్రికి, జనసేన అధినేత.! ఆనాటి ఆ ఫొటోలు, ఆ విజ్ఞాపనా పత్రం.. ఇవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు.. వాటిని వైరల్ చేస్తున్నారు మరి.! ‘చేసిన మంచి పనులు చెప్పుకోకపోతే ఎలా.?’ అన్నది వారి భావన. అందులో తప్పు పట్టడానికేముంది.?

సరే, కేంద్రం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో ముందుకెళ్ళడంలేదు.. అని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి చేసిన ప్రకటన ‘ఘనత’ ఎవరి ఖాతాలో వెయ్యాలి.? అన్నది వేరే చర్చ. ‘మేం ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారీ, ఉక్కు పరిశ్రమ గురించి కేంద్రంతో మాట్లాడుతూనే వున్నాం.. దాని ఫలితమే, ఇప్పుడీ ప్రకటన..’ అని వైసీపీ, ఆ ఘనతను తమ ఖాతాలో వేసుకోవడాన్ని కూడా తప్పు పట్టలేం.

ఇంకోపక్క, తెలంగాణలోని అధికార పార్టీ కూడా, ‘మేం బిడ్ వేయాలనుకున్నాం.. కేంద్రం దిగొచ్చింది..’ అనడమూ సబబే. మధ్యలో, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష టీడీపీకే ఎలాంటి ‘క్రెడిట్’ లేకుండా పోయింది. తెలుగు తమ్ముళ్ళు ఈ విషయమై గింజేసుకుంటున్నారు. వైసీపీ ఓకే.. బీఆర్ఎస్ కూడా ఓకే.. కానీ, జనసేనకు క్రెడిట్ వెళ్ళడమేంటి.? అన్నది తెలుగు తమ్ముళ్ళ ఆవేదన. ఔను, జనసేనకు వైసీపీ కంటే పెద్ద శతృవు టీడీపీనే.!