వైసిపిని పొగిడిన టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు

వైసిపిని పొగిడిన టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు

తిత్లీ తుఫాను కారణంగా నష్టపోయిన శ్రీకాకుళం ప్రజల్ని ఆదుకోవడానికి, రాజకీయ నాయకులూ, సినీ నటులు, పారిశ్రామికవేత్తలు ఒక్కొక్కరిగా ముందుకు వస్తున్నారు. తమవంతుసాయంగా తోచిన విరాళాన్ని సీఎం సహాయనిధికి పంపుతున్నారు. తమ అభిమానుల్ని కూడా సహాయం అందించాల్సిందిగా వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం బాధితులకు అండగా నిలిచింది ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. సోమవారం కోటి రూపాయల విరాళాన్ని శ్రీకాకుళంకి ప్రకటించింది. వైసీపీ సహాయాన్ని అభినందించారు శ్రీకాకుళం టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు. ఆయన ఏమన్నారో కింద ఉంది చదవండి.

తిత్లీ తుఫానుతో విలవిల్లాడుతున్న శ్రీకాకుళం తుఫాను బాధితులను ఆదుకోవడానికి ముందుకొచ్చింది వైసీపీ పార్టీ. పార్టీ తరపున కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించింది. అంతేకాదు శ్రీకాకుళం జిల్లాలోని వైసీపీ నేతలు, కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని పార్టీ తెలిపింది. శ్రీకాకుళం వైసీపీ శ్రేణులే కాకుండా రాష్ట్ర నలుమూలల నుండి వైసీపీ వర్గాలు శ్రీకాకుళంకి తమవంతు సహాయం చేస్తూ అండగా నిలబడ్డాయి.

ఈ సందర్భంగా టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు వైసీపీని అభినందించారు. ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసారు. ” తిత్లీ తుఫాను బాధితులకు సహాయార్ధం విరాళం ప్రకటించిన వైసీపీ పార్టీకి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇటువంటి కష్టకాలంలో మనమంతా పార్టీలకు అతీతంగా ప్రజలకు సహాయం చేయడానికి కలిసి ముందుకు సాగాలి” అని పోస్ట్ చేశారు.

https://twitter.com/RamMNK/status/1052099466604335104