రాజకీయాల్నుంచి తప్పుకుంటున్న మరొక తండ్రి…

తెలుగు రాజకీయాల్లోకి మరొక వారసుడొస్తున్నాడు. 2019లో చాలా మంది సీనియర్ రాజకీయ నాయకులు తమ వారసుల భవిష్యత్తు  పరీక్షించాలనుకుంటున్నారు. ఈ జాబితాలోకి మరొక తండ్రి చేరాడు. ఆయనే సంచలనాల రాజకీయ నాయకుడు, తాడిపత్రి టిడిపి ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి. తాను క్రియాశీల రాజకీయాలనుంచి నెమ్మదిగా తప్పుకుని కొడుకుని వారసునిగా జనంలోకి తీసుకువస్తున్నారు. 2019 ఎన్నికల్లో  కుమారుడు అశ్మిత్‌రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడుతున్నట్లు ఆయన ప్రకటించారు. తన మీద తాడిపత్రి నియోజకవర్గ ప్రజలు చూపిన ప్రేమ, ఆదరాభిమానాలే ఆశ్మిత్ పట్ల కూడా చూపాలని ఆయన ఒక సభలో మాట్లాడతూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ ప్రకటనే ఆలస్యమయింది తప్ప, అశ్మిత్ చాలా కాలంగా ప్రొబేషన్ లో ఉన్నాడు. తెలుగుదేశం కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆశీస్సులు కూడా ఉన్నాయి. జెసి సీనియర్స్ తప్పకుంటే, జిల్లారాజకీయాల్లో పాతతరం పూర్తిగా అంతరించినట్లే లేక్క. జెసి కుటుంబానికి సంబంధించి రాజకీయాలలో ఇది మూడో జనరేషన్. అస్మిత్  తాత జెసి నాగిరెడ్డితో వారింట రాజకీయాలు మొదలయ్యాయి. ఆయన ఒకనాటి రాష్ట్రపతి  సంజీవరెడ్డికి సన్నిహితులుగా ఉండేవారు. ఎంపి, ఎంఎల్ సి జడ్ పి ఛెయిర్మన్ గా ఎన్నికయ్యారు.

తన రాజకీయాల గురించి మాట్లాడుతూ రాబోయేతాడిపత్రి మున్సిపల్‌ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పోటీచేస్తానని దానివల్ల  నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పట్టణాభివృద్ధికి కృషిచేస్తానని జెసి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆయన సంచలనాల రాజకీయాలలో స్వచ్ఛ తాడిప్రతి కూడా ఒకటి. నిజానికి, ప్రధాని మోదీ స్వఛ్ఛభారత్ ప్రవేశపెట్టడానికి ముందే ఆయన స్వచ్ఛ తాడిపత్రిని అమలుచేశాడు. నయాన భయాన తాడిపత్రి ప్రజలను దారిక తీసుకువచ్చి, రోడ్ల మీద చెత్త వేయకుండా చేశాడు. వూర్లో చెట్టునాటడం, నాటిన చెట్లను కాపడటంలో తాడిప్రతి ప్రజలను బాధ్యతాయుత పౌరులుగా మార్చాడు. ఇందులో బలప్రయోగం కూడాఉందని,  మంచి పని కోసం బలం ప్రయోగించడం తప్పేమీ కాదని ఆయన చెప్పారు.

తన లక్షణాలను అంటే నయాన లేదా భయాన పనులుచేయించే లక్షణాలను జేసీ అశ్మిత్‌ పుణికి పుచ్చకున్నాడని  తనరీతిలోనే  నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడిపిస్తూ రా ష్ట్రంలో ఇతర నియోజకవర్గాలకు మార్గదర్శకంగా నిలుస్తాడని ఆయన హామీ ఇచ్చారు. అశ్మతి ఇపుడు స్పర్ష అనే స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నాడు. తాడిపత్రిలో భవిష్యత్తులో పట్టణంలో సూపర్‌స్పెషాలిటీ హా స్పిటల్‌ ఏర్పాటుచేయాలన్న పెదనాన్న, నాన్న  ఆశయమని దానిని నెరవేర్చేందుకు కృషి చేస్తానని అన్నారు. పార్క్ నిర్మాణానికి సభలోనే అశ్మిత్‌రెడ్డి రూ.10 లక్షలు విరాళం ప్రకటించారు.

అశ్మిత్ పెద్ద నాన్న జెసి దివాకర్ రెడ్డి కూడా కొడుకు పవన్ ని రాజకీయాల్లోకి తీసుకురావానుకుంటున్నారు.  దీనికోసం ఆయన 2019 లో మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని, రాజకీయాలనుంచి తప్పుకుంటాననికూడా  ప్రటించారు. పక్కనే కర్నూలు జిల్లాలో కూడా ఉపముఖ్యమంత్రి కెయి కృష్ణ మూర్తి కొడుకుని పత్తికొండ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలనుకుంటున్నారు. అలాగేపరిటాల శ్రీరాం కూడా తయారవుతున్నారు.  టిడిపికి కాత్త తరం నాయకత్వం  తయారువుతూ ఉంది. 2019 టిడిపి పరిణామంలో ఒక కొత్త మలుపు కానుంది.