వారిద్ద‌రూ ప‌వ‌న్ క‌ల్యాణ్ బ్రోక‌ర్ల‌ట‌!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడును బీజేపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు తూర్పు గోదావ‌రి జిల్లా కేంద్రం కాకినాడ‌లో అడ్డుకోవ‌డాన్ని ఏ మాత్రం స‌హించ‌లేక‌పోతున్నారు టీడీపీ నాయ‌కులు. బీజేపీ నేత‌ల‌పై నిప్పులు చెరుగుతున్నారు. నోటికొచ్చిన‌ట్టు మాట్లాడేస్తున్నారు. చంద్రబాబు కనుసైగ చేస్తే చాలు, బీజేపీ నాయ‌కులు రోడ్ల మీద తిర‌గ‌లేర‌ని, గ‌డ‌ప దాటి బ‌య‌టికి రాలేర‌ని వార్నింగ్ ఇస్తున్నారు. అక్క‌డితో ఆగ‌లేదు.

బీజేపీ రాష్ట్ర శాఖ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ‌, సీనియ‌ర్ నేత సోము వీర్రాజు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు బ్రోక‌ర్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపించారు. పాముకు పాలు పోసి పెంచినట్లుగా తాము బీజేపీ నేతలకు మంత్రి పదవులు ఇచ్చి తప్పు చేశామని టీడీపీ నేత బాబూ రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోంటే, చూసి త‌ట్టుకోలేక‌పోతున్నార‌ని ఆయ‌న అన్నారు.

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీకి మించి చంద్ర‌బాబుకు దేశ‌, విదేశాల్లో మంచి పేరు వ‌స్తోంద‌ని అన్నారు. ఆ అక్క‌సుతో మోడీ కూడా త‌మ పార్టీ నాయ‌కుడిని చుల‌క‌న‌గా చూస్తున్నార‌ని అన్నారు. ప్రధాని స్థాయి నుంచి దిగజారి మాట్లాడుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, సోము వీర్రాజుకు టీడీపీ అంటే మొద‌టి నుంచీ ప‌డ‌దు.

వారిద్ద‌రూ ప‌వ‌న్ క‌ల్యాణ్ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులు కావ‌డంతో.. అదే వ‌ర్గానికి చెందిన నేత‌ల‌తో ఇష్టానుసారంగా తిట్టించ‌డం చంద్ర‌బాబుకు బాగా తెలిసిన విద్య‌. అదే పాచిక‌ను ఇక్క‌డా వేశారు. ఏ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడిని, అదే వ‌ర్గానికి చెందిన త‌న వారితో విమ‌ర్శ‌లు చేయించ‌డం, ఆరోప‌ణ‌లు గుప్పించ‌డం టీడీపీకి కొత్తేమీ కాదు.