చెరి సగం.! చంద్రబాబు సిద్ధమేనట.! జనసేన గెలిచినట్టే.!

ఎన్ని సీట్లలో పోటీ చేస్తాం.. అన్నది ముందు ముందు మాట్లాడుకుందాం. అధికారం అంటూ దక్కితే, చెరి సగం పంచుకుందాం.. ఈ దిశగా జనసేన – టీడీపీ మధ్య చర్చలు జరుగుతున్నాయట. ఈ చర్చల్లో ముందడుగు కూడా పడినట్లు తెలుస్తోంది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో అధికారం పంచుకోవడం అంశంపైనే కీలకంగా చర్చ జరిగినట్లు చెబుతున్నారు. నిజానికి, ఈ భేటీకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రమే హాజరయ్యారు. జనసేన నేతలెవరూ, టీడీపీ నేతలెవరూ ఈ భేటీలో పాల్గొనలేదు.

వన్ టూ వన్ భేటీలో జరిగిన ఈ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలపై భిన్న కథనాలు వినిపించడం సహజమే. జనసేనకు 20 సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారని టీడీపీ అనుకూల మీడియా చెబుతోంది. కాదు కాదు, చెరి సగం.. విషయంలో అస్సలు తగ్గేది లేదని జనసేన వర్గాలు అంటున్నాయి.

ఓ వైపు నారా లోకేష్ యువగళం పాదయాత్ర జరుగుతుండగా, ఇంకో వైపు ఈ పొత్తుల చర్చలు.. సహజంగానే టీడీపీ, జనసేన వర్గాల్లో కొంత ఉత్కంఠకు అవకాశమిస్తుంది. ఆ ఉత్కంఠ కాస్తా, అధికారం పంపిణీ.. అనే చర్చ తెరపైకి రావడంతో.. ఇరు పార్టీల మధ్యా రచ్చకు కారణమవుతోంది.

టీడీపీ అంచనాల ప్రకారం జనసేన పార్టీ 50 సీట్లలో గెలిచే అవకాశం వుందని తేలుతున్న దరిమిలా, సగం సీట్లు.. అలాగే, సగం కాలం అధికారం.. జనసేనకు చంద్రబాబు ఆఫర్ చేయక తప్పని పరిస్థితి అయితే వుంది. కానీ, ఏరు దాటాక తెప్ప తగలేసే అలవాటున్న చంద్రబాబు నుంచి జనసేన ఎలా నెగ్గుకు రాగలుగుతుందన్నది వేచి చూడాల్సిందే.