నివురుగప్పిన నిప్పుకు పిఠాపురంలో పొగలు… వైరల్ గా జనవరిలో లోకేష్ మాటలు!

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కనీసం 15 ఏళ్లు అధికారంలో ఉండాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలు వేదికలపై ఇప్పటికే చాలా సార్లు చెప్పిన సంగతి తెలిసిందే. అంటే.. కూటమి తరుపున ఆయన సీఎం అవుతారా.. లేక, ఇలా డిప్యుటీ గానే సరిపెట్టుకుంటారా అనే జనసేన కార్యకర్తలు, అభిమానుల ప్రశ్నకు ప్రస్తుతానికి మౌనమే సమాధానంగా మారిన పరిస్థితి.

దీంతో… గ్రౌండ్ లెవెల్ రియాలిటీ, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ 2014, 2019లో స్వయంగా ఫేస్ చేయడం వల్లో ఏమో కానీ.. పవన్ మనసంతా టీడీపీ, బీజేపీ లతో కూడిన కూటమిలో కొనసాగడంపైనే ఉందని తెలుస్తోందని అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పలు ప్రశ్నలు తెరపకి వస్తున్నాయి.

ఇందులో భాగంగా… పవన్ కల్యాణ్ ఆంక్షాక ఎలా ఉన్నప్పటికీ… మరి ఆయన నమ్ముకున్న, ఆయనను నమ్ముకున్న జనసైనికుల కోరిక ఏమిటి అనేది ఆయన ఎప్పుడైనా ఆలోచించారా..? పైగా… వాజ్ పేయి, నరేంద్ర మోడీ వంటి నేతలనే పనైపోయాక పక్కకెళ్లి ఆడుకోమన్నట్లుగా రాజకీయం చేయగల చరిత్ర కలిగిన చాణక్యుడు చంద్రబాబును నమ్మడం పవన్ పొలిటికల్ కెరీర్ కి క్షేమమేనంటారా..? అనేవి కొంతమంది ప్రశ్నలుగా ఉన్నాయి.

మరోవైపు… ఇవన్నీ పవన్ కల్యాణ్ కి తెలియదని మీరనుకుంటున్నారా..? పవన్ ని మరీ అంత అమాయకంగా అంచనావేస్తున్నారా..? ఆయనకు మోడీతో నేరుగా కాంటాక్ట్ ఉందని మరిచిపోతున్నారా..? అసలు ఏపీలో కూటమి ఏర్పడటానికి హస్తినలో ఆయన తిప్పిన చక్రాలే కారణం అనే సంగతి గుర్తుపెట్టుకోలేకపోయారా..? అని మరికొంతమంది ఎదురు ప్రశ్నిస్తున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో… చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య ఎంత అవినాభావ సంబంధం ఉన్నప్పటికీ… గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు మాత్రం అంత ఆశాజనకంగా లేవని.. పలు చోట్ల జనసైనికులు రగిలిపోతున్నారనే చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో… టీడీపీ వర్సెస్ జనసేనగా ఉన్నట్లు చెబుతోన్న నివురుగప్పిన నిప్పుకు పిఠాపురంలో తాజాగా పొగలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. దీంతో.. నిప్పు లేకుండా పొగరాదుకదా అనే ప్రశ్నకు జస్టిఫికేషన్ జరిగిందని అంటున్నారు.

అసలేం జరిగిందంటే… పిఠాపురం నియోజకవర్గంలో కూటమి రాజకీయాల్లో విభేదాలు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఇతర ప్రాంతాల టీడీపీ, జనసేన నేతలు… కూటమి పార్టీల ఐక్యతను చూసి తట్టుకోలేక వైసీపీ జనాలు కావాలనే ఈ తరహా ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. లోకేష్ కూడా పలు సందర్భాల్లో ఈ తరహా రియాక్షనే ఇచ్చారు.

కట్ చేస్తే… పిఠాపురంలో టీడీపీ నేత ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ వర్సెస్ జనసేన అనే చర్చ చాలా సందర్భాల్లో తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. స్థానిక జనసేన నాయకులకు, టీడీపీ జనాలకూ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని అంటున్నారు. పైగా… పిఠాపురం నియోజకవర్గంలో జనసేన నేత కొణిదెల నాగబాబు జోక్యం ఎక్కువవుతున్నకొద్దీ సమస్యలు పెరుగుతున్నాయనే మాటలూ వినిపిస్తున్నాయి. ఆయన మంటలు ఆర్పాల్సింది పోయి, అగ్నికి ఆజ్యం పోస్తున్నారని అంటున్నారు.

ఈ క్రమంలో… గతంలోనే పలుమార్లు విభేదాలు పొడసూపిన పిఠాపురం కూటమి నేతల మధ్య, తాజాగా ఫ్లెక్సీల విషయంలో వివాదం తలెత్తింది. అలా అని ఇది మీడియా మైకుల ముందు మాట్లాడటం, అధికారులకు ఫిర్యాదు చేయడంతో ముగియలేదు… చినికి చినికి గాలివానగా మారింది అన్నట్లుగా.. మాటా మాటా పెరిగి, తోపులాట వరకు వెళ్లింది వ్యవహారం.

వివరాళ్లోకి వెళ్తే… ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీలో సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో కనిపించలేదు! దీంతో… జనసైనికుల వ్యవహారంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు! కూటమి ధర్మాన్ని పాటించకుండా టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఎలా వేస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ తరహా ప్రవర్తన ఇదే తొలిసారి కాదని గుర్తు చేస్తూ… స్థానిక జనసేన నేతలతో ఆయన వాగ్వాదానికి దిగారు.

దీంతో… జనసేన నేత తుమ్మల బాబు గట్టిగా స్పందించారు. ఈ క్రమంలో మాట మాట పెరగడంతో అక్కడే ఉన్న జనసేన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఒక్కసారిగా వర్మపైకి దూసుకెళ్లారు. ఇలా నేతల మధ్య వాగ్వాదం కాస్తా కార్యకర్తల మధ్య తోపులాటకూ దారి తీసింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు.

పొమ్మన లేక పొగ..?:

పిఠాపురంలో తొలుత టీడీపీ తరుపున వర్మ ఎమ్మెల్యే అభ్యర్థి అని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. గతంలో గాజువాక, భీమవరంలో ఓటమి పాలైన పవన్ కల్యాణ్.. ఈ సారి ఎలాగైనా గెలవాలని, అందుకు టీడీపీ కూడా సహకరించాలని, ఆ పార్టీ బలంగా ఉన్న పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లున్నారు. దీంతో… వర్మకు టిక్కెట్ పోయింది.

ఆ సమయంలో స్థానిక టీడీపీ కార్యకర్తలను, వర్మ అభిమానులను శాంతిపంచేయడానికో ఏమో కానీ… చంద్రబాబు పెద్ద పెద్ద వాగ్ధానాలే చేశారు! ఇందులో భాగంగా… వర్మను ఎమ్మెల్సీ చేస్తానని, కుదిరితే కేబినెట్ లోకి కూడా తీసుకుంటానన్నట్లుగా హింట్ ఇచ్చారు! దీంతో… ఆయన అభిమానులు, కార్యకర్తలు విజిల్స్ వేస్తూ, చప్పట్లు కొట్టారు. కట్ చేస్తే… ఎన్నికల ఫలితాలు వచ్చాయి.. కూటమి అధికారంలోకి వచ్చింది.. నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు కానీ… వర్మకు ఆ ఛాన్స్ దక్కలేదు!

అప్పటి నుంచి పిఠాపురం నియోజకవర్గంలోని సగటు టీడీపీ కార్యకర్త, వర్మ అభిమానులు రగిలిపోతున్నారని అంటున్నారు. పైగా ఇప్పుడు పిఠాపురంలో నాగబాబు అనధికారిక ఎమ్మెల్యేగా అజమాయిషీ చేస్తున్నారని.. ఇది వర్మ & కో ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారనీ చెబుతున్నారు. పైగా… పరిస్థితి ఇలాగే ఉంటే తాను పిఠాపురానికి శాస్వత మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోతానేమో అనే ఆందోళనా వర్మలో ఉందని ప్రచారం జరుగుతుంది.

అందుకే “కూటమి నుంచి క్విట్ జనసేన” అనే స్లోగన్ ను చాపకింద నీరులా టీడీపీ కార్యకర్తల్లోకి తీసుకెళ్తున్నారనే చర్చ జరుగుతుంది. ఒక్క పిఠాపురంలో మాత్రమే ఇలాంటి పరిస్థితులు ఉంటే ఎవరు ఆ స్థాయిలో ఆలోచించకపోవచ్చు. కానీ… ఇంకా ఎన్నో ప్రాంతాల్లో ఈ తరహా సెగలు రగులుతున్నాయి. ఈ నేపథ్యంలోనే… కూటమిలో జనసైనికులను ఆటలో అరటి పండులా చూస్తున్నారనే చర్చ బలంగా వినిపిస్తోంది. ఇది ముదిరి పాకాన పడి… “పొమ్మనలేక పొగబెడుతున్నారా..?” అనే సందేహాలకూ దారి తీస్తోంది.

తాజాగా శ్రీకాకుళం జిల్లాలోనూ ఈ తరహా సంఘటన తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా… కార్గిల్ పార్క్, ఆమదాలవలస – శ్రీకాకుళం రోడ్డు లైటింగ్ ప్రారంభోత్సవం వంటి కార్యక్రమాలకు శ్రీకాకుళం అర్బన్ డెవలప్‌ మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్ కొరికాన రవికుమార్ కు ఆహ్వానం అందలేదట. ఆ పనులన్నీ శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ నిధులతో చేసినవేనని, అయినప్పటికీ.. సాక్ష్యాత్తు సుడా చైర్మన్ ను పిలవకపోవడం ఏంటన్నది జనసేన నాయకుల ప్రశ్న కం ఆవేదనగా ఉందని అంటున్నారు.

ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాలానే ఉందని అంటున్నారు పరిశీలకులు. అలా అని ఈ విషయాలు చంద్రబాబుకు తెలియదా అంటే… ఆయన రాజకీయం అంత ఈజీగా అర్ధమవ్వదని అంటున్నారు పరిశీలకులు.

పోనీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ దృష్టికైనా రాలేదా అంటే…? దానికి సమాధానం… ఈ ఏడాది జనవరిలో నూత‌న పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో పాటు జోనల్ కోఆర్డినేటర్లతో ఉండ‌వ‌ల్లిలోని నివాసంలో నిర్వ‌హించిన స‌మావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకోమని చెబుతున్నారు.

ఇంతకూ ఆ రోజు లోకేష్ ఏమన్నారంటే… “1999లో మాత్రమే మనం రెండోసారి గెలిచామ‌ని.. ఆ చరిత్ర తిరగరాయాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పిన లోకేష్… సొంతిల్లు కంటే కిరాయి ఇల్లుపై దృష్టి పెడుతున్నామ‌ని.. దీనికి ఫుల్ స్టాప్ పడాల‌ని” కోరుతూ కామెంట్ చేశారు. దీంతో… ఈ వ్యాఖ్యలు చాలు.. పొత్తుల పాలిటిక్స్ పై లోకేష్ ఎంత అసంతృప్తిగా ఉన్నారో చెప్పడానికి అనే చర్చ నాడు బలంగా జరిగింది.

లోకేష్ మాటలను సరిగ్గా అర్ధం చేసుకుంటే… సొంతంగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసుకునేలా పార్టీ బ‌ల‌ప‌డాల‌నేది ఆయ‌న ఆకాంక్ష‌గా ఉంది. ఇదే సమయంలో… సొంతిల్లు కంటే కిరాయి ఇల్లుపై దృష్టి పెడుతున్నామ‌నే మాటకు… సొంత కాళ్ల‌పై కంటే జ‌న‌సేన‌, బీజేపీల‌పై ఆధార‌ప‌డ‌డానికే ప్రాధాన్యం ఇస్తున్నామ‌నే అర్థం ధ్వ‌నిస్తోందని అంటున్నారు.

సో… జనవరిలో లోకేష్ చేసిన వ్యాఖ్యలకు, తాజాగా జరుగుతున్న పరిణామాలకూ పొంతన లేకపోలేదనేది పరిశీలకుల మాటగా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో… కూటమిలో ఏమి జరగబోతుందనేది వేచి చూడాలి!

పోనీ ఈ విషయాలన్నీ పవన్ కు తెలియదా అంటే…? ఆయన పార్టీని పక్కన పెట్టి, పరిపాలన, సినిమాల్లో బిజీగా ఉన్నారనేది ఓ వర్గం జనసైనికుల మాటగా ఉండగా… చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం లేదనే విషయం తమ అధినేత గ్రహించాలనేది మరోవర్గం జనసైనికుల అభిప్రాయంగా ఉన్న పరిస్థితి! మరి.. జనసైనికుడు గ్రౌండ్ లెవెల్ లో మానసికంగా తగలబడిపోతుంటే.. డిప్యూటీ సీఎం ఆఫీసులో పవన్ పిడేల్ వాయిస్తే ఎలా..? వెనుక బీజేపీ ఉందిలే అన్న ధైర్యమా..?